Thursday, May 2, 2024

క‌త్తులు దూసిన‌ భూ కక్షలు.. ఇరువ‌ర్గాల‌ దాడి, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

లింగాలఘన్ పూర్, (ప్రభన్యూస్) : జ‌న‌గామ జిల్లాలో భూ త‌గాదాలు క‌త్తులు దూశాయి. చాలాకాలంగా అంత‌ర్లీనంగా ఉన్న ఆక్రోశం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్న‌ది. దీంతో ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా మారింది. తీవ్ర గాయాలైన వారిని హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం.. సిరిపురం గ్రామానికి చెందిన కీసరి రంగారెడ్డి, వెంకటరెడ్డి, కొరుపెల్లి రాంరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి వర్గాల మ‌ధ్య భూ ఒప్పందం ఉంది. అయితే ఒకే భూమిపై వివాదం కార‌ణంగా వీరి మ‌ధ్య త‌గాదాలు జ‌రుగ‌తున్నాయి. కాగా, శనివారం కీసరి రంగారెడ్డి, వెంకటరెడ్డి వ్యవసాయ భూమిని కొరుపెల్లి రామ్ రెడ్డి కుమారులు రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ తో దున్నుతున్నారు. దీనికి అడ్డువచ్చిన కీసరి వెంకటరెడ్డి, రంగారెడ్డిపై వారు విచక్షణహితంగా దాడికి దిగారు. దీంతో వెంకటరెడ్డికి గాయాల‌య్యాయి.

దీనిపై లింగాల ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి డాక్ట‌ర్లు రిఫ‌ర్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంకట్ రెడ్డి కుమారులు కోపోద్రికులై వ్యవసాయ భూమి వద్ద ఉన్న కొరుపెల్లి రామిరెడ్డి, రాజిరెడ్డిపై దాడికి దిగారు. దీంతో రాజిరెడ్డి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. అత‌డిని కూడా పోలీసులు ట్రీట్‌మెంట్ కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇరు వ‌ర్గాల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement