Wednesday, May 15, 2024

కుంట శ్రీనునే ఎ 1…..

హైదరాబాద్‌/పెద్దపల్లి, : పట్టపగలు నడిరోడ్డుపై పాశవికంగా న్యాయవాద దంపతులను హత్య చేసిన కేసులో కుంట శ్రీనే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. రా ష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన ఈ కేసులో ఏ-2గా అవందుల చిరంజీవి, ఏ-3గా అక్కపాక కుమార్‌లు ఉన్నారని నార్త్‌ జోన్‌ ఐజీ తెలిపారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో మీడియా సమక్షంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. హత్యకు గురైన వామన్‌ రావు, ప్రధాన నిందితుడు కుంట శ్రీనుది ఒకే గ్రామమని తెలిపారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గతంలో కుంట శ్రీనుకు చెందిన భూముల విషయంలో వామన్‌ రావు దంపతులు పలు కేసుల వేశారు. చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. శ్రీనును వామన్‌రావు గట్టిగా ఎదుర్కొంటున్నాడు. దాన్ని తట్టులోకేక వామన్‌రావును హత్య చేయాలని శ్రీను నిర్ణయించుకున్నట్టు విచారణలో తెలిందని తెలిపారు. గ్రామంలోని రామాలయ కమిటీకి సంబంధించి వెల్ది వసంత రావు, అనంతయ్య, గట్టు విజయ్‌కుమార్‌పై హకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వామన్‌ రావు తన తండ్రి కిషన్‌ రావు, చిన్న తమ్ముడు ఇంద్రశేఖర్‌రావు సంతకాన్ని తీసుకొని మంథని నుంచి హైదరాబాద్‌కు వెలుతుండగా కల్వచర్ల పెట్రోల్‌ పంప్‌ వద్ద కారును అడ్డగించి శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశా రని తెలిపారు. వీరికి అక్కపాక కుమార్‌ సహకరించారని ఐజీ అన్నారు. శ్రీనుపై గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయన్నారు. ఈ హత్యకు వాహనం సమకూర్చిన వ్యక్తిని గుర్తించామని, త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. ఈ హత్య జరుగుతున్నప్పుడు లైవ్‌ వీడియో తీసిన వారు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వీడియో ప్రధాన సాక్ష్యం కానుందని వెల్లడించారు. వీడియో తీసిన వారు దానిని పోలీసులకు అప్పగిస్తే న్యాయవాద కుటుంబానికి న్యాయం చేసిన వారౌతారని అన్నారు.
రాజకీయ కోణం లేదు
ఈ కేసులో ఇప్పటి వరకు రాజకీయ కోణం ఉన్నట్టు తమ విచారణలో తేల లేదని ఆయన తెలిపారు. స్థానికంగా ఉండే భూవివాదాలే కారణమని పేర్కొన్నారు. గతంలో లీకైన ఒక ఆడియో తమ దృష్టికి వచ్చిందని దానిలో కుంటు శ్రీను పేరు పలు మార్లు ప్రస్తావనకు వచ్చిందన్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్‌ అండ్‌ సోషల్‌ మీడియా ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement