Tuesday, April 30, 2024

Kerala : రాసిపెట్టుకోండి…జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం

రాసిపెట్టుకోండి… జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని వాయనాడ్ లో రైతుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు..తెలివైన వారన్నారు.

కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయ‌ని .. కానీ కేరళ అభివృద్ధి కాలేదన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారన్నారు. బంగారం స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం త‌న‌కు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సీఎం విజయన్ పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా.. ఆయనపై మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

- Advertisement -

ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయన్నారు. కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయడం లేదన్నారు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్ కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు అన్నారు.

మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. వాయనాడ్ లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని అన్నారు.

ఈడీ, ఆదాయపన్ను కేసులున్ననని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయరన్నారు. మణిపూర్ లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయారని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా మణిపూర్ లో పర్యటించలేద‌ని.. కాని రాహుల్ గాంధీ అక్కడి బాధితులను కలిశారని గుర్తు చేశారు రేవంత్. . దేశంలో రెండు పరివార్ ల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోడీ పరివార్ లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్కంట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇండియా పరివార్ లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని తెలిపారు. ఇందిరా, రాజీవ్ లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నార‌ని, అయితే తాను ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే తాను తెలంగాణ నుంచి వచ్చా అని తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరామన్నారు. కానీ.. వాయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్ లో 65 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ సారి 75 శాతం ఓట్లు రావాలన్నారు. మోడీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నామన్నారు. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందన్నారు. వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు… దేశానికి కాబోయే ప్రధానికి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement