Sunday, May 5, 2024

Israel vs Palestina – అయిదు వేల రాకెట్ల‌తో ఇజ్రాయిల్ పై విరుచుకుప‌డ్డ పాల‌స్తీనా మిలిటెంట్లు ….50 మందికి పైగా మృతి

జెరూసలెం: ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్‌ సహా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల‌లో 50 మందికి పైగా పౌరులు మ‌రణించార‌ని, 100 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని ఇజ్రాయేల్ అధికారులు ప్ర‌క‌టించారు.. అలాగే ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ దాడుల‌తో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది. అప‌రేష‌న్ క‌మాండో చేప‌ట్టింది.. హ‌మాస్ మిలిటెంట్ల‌ను ఏరి వేసే కార్య‌క్ర‌మాన్ని భారీగా చేప‌ట్టింది ఇజ్రాయేల్ సైన్యం. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. తాము యుద్ధానికి సిద్ధగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.

1967 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement