Sunday, April 28, 2024

యాంటీ బయాటిక్ మందులను అతిగా వాడేసిన భారతీయులు

కరోనా వైరస్ కారణంగా భార‌త్‌లో యాంటీబ‌యాటిక్ మందుల‌ను అతిగా వాడిన‌ట్లు ఓ అధ్య‌య‌నంలో తేలింది. భార‌త్‌లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ వ‌చ్చిన త‌ర్వాత‌ యాంటీబ‌యాటిక్స్ మందుల అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగిన‌ట్లు స్ట‌డీలో తెలిపారు. స్వ‌ల్ప‌, మ‌ధ్య స్థాయిలో క‌రోనా వ‌చ్చిన వారికి చికిత్స‌లో భాగంగా యాంటీబ‌యాటిక్స్ మందుల్ని అమ్మిన‌ట్లు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఈ స్ట‌డీ చేశారు. గ‌త ఏడాది జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఇండియాలో సుమారు 21.6 కోట్ల‌ డోసుల యాంటీబ‌యాటిక్స్ వాడిన‌ట్లు నిర్ధారించారు. వీటికి తోడు అద‌నంగా మ‌రో 3.8 కోట్ల డోసులు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు విచ్చ‌ల‌విడిగా అమ్ముడుపోయిన‌ట్లు స్ట‌డీలో గుర్తించారు.

యాంటీబ‌యాటిక్స్ వ‌ల్ల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు పెను ప్ర‌మాదం ఉంద‌ని వైద్యులు చెప్తున్నారు. అతిగా యాంటీబ‌యాటిక్స్ వాడ‌డం వ‌ల్ల మందుల‌కు త‌గ్గే ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా న‌యం కావ‌న్నారు. వ్యాధి నిరోధ‌క మందుల‌ను అతిగా వాడ‌డం వ‌ల్ల సాధార‌ణ న్యూమోనియా లాంటి వ్యాధుల్ని ట్రీట్ చేయ‌డం ఇబ్బందిగా మారుతుంద‌ని వారు తెలిపారు. దీంతో ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తాయ‌న్నారు. మ‌లేరియా, డెంగ్యూ, చికున్‌గునియా లాంటి వ్యాధుల‌కు వాడే మందుల అమ్మ‌కాలు ఇండియాలో త‌గ్గిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. నిజానికి ఇండియాలో యాంటీబ‌యాటిక్స్ వాడ‌కం త‌గ్గాలి కానీ.. దానికి విరుద్ధంగా కోవిడ్ కేసుల త‌ర‌హాలో వాటి వాడ‌కం పెరిగింద‌న్నారు. భార‌త్‌లో క‌రోనా సోకిన ప్ర‌తి ఒక్క‌రూ యాంటీబ‌యాటిక్ మందు వాడిన‌ట్లు త‌మ ఫ‌లితాలు తేల్చిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు.

ఇది కూడా చదవండి: మూడు రోజులు బావిలోనే గడిపిన వృద్ధుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement