Sunday, April 28, 2024

పర్యావరణాన్ని కాపాడ్డంలో ముందువరుసలో భారత్ : హర్దీప్ సింగ్ పురి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించడంలో భారతదేశం ముందు వరుసలో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. శుక్రవారం ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్‌‌)లో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2023లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు పెరుగుతున్న ఇంధన డిమాండ్‌‌ను తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు. ఆటో ఎక్స్‌పో-2023 దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమకు సరికొత్త సాంకేతికత, సామర్థ్యంతో పాటు భవిష్యత్తు అవసరాలకు తగిన మొబిలిటీ ఎకో సిస్టమ్ తయారుచేసేందుకు పరిష్కారాలను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒక వేదికను అందిస్తుందని అన్నారు.

ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసిఎంఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఏఎం) సంయుక్తంగా “ఎక్స్‌ప్లోర్ ది వరల్డ్ ఆఫ్ మొబిలిటీ” అనే థీమ్‌తో ఈ ఆటో ఎక్స్‌పో-2023ని నిర్వహిస్తున్నాయి.ఈవెంట్‌కు 100 కంటే ఎక్కువ కంపెనీలు, 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రదర్శన ఇన్వెస్టర్లను ఆకట్టుకోడానికి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని, నైపుణ్యం కల్గిన మానవ వనరుల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.

- Advertisement -

ఇథనాల్ మిశ్రమంలో భారతదేశం సాధించిన పురోగతి గురించి మంత్రి మాట్లాడుతూ  2013-14లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53% ఉండగా 2022 నాటికి 10.17%కి పెంచామని తెలిపారు. ముందే నిర్దేశించుకున్న గడువు కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని 2030 నుంచి  2025-26కు ముందుకు జరిపామని చెప్పారు. ఇది దేశ ఇంధన భద్రతను పెంపొందించడమే కాకుండా, రూ. 41,500 కోట్ల మేర ఫారెక్స్ నిల్వలను ఆదా చేస్తుందన్నారు. జీహెచ్‌జీ ఉద్గారాలను 27 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడంతో పాటు రైతులకు రూ.40,600 కోట్లకు చెల్లింపులు జరిపి రైతులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు.

సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 5% నుంచి 1%కి తగ్గించడం గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. తద్వారా ఇథనాల్ సరఫరాదారులకు దాదాపు రూ.400 కోట్లు ఆదా అయ్యాయన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కోసం బయో-ఇంధనంపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హర్యానాలోని పానిపట్ (పరాలీ), పంజాబ్‌లోని భటిండా, ఒడిశాలోని బార్‌గఢ్ (పరాలీ), అస్సాంలోని నుమాలిగఢ్ (బ్యాంబు), కర్ణాటకలోని దేవనగెరెలో ఐదు 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement