Tuesday, March 26, 2024

ఓలాలో 200 మందిపై వేటు

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా మన దేశంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. టెక్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్‌కు చెందిన 200 మంది ఉద్యోగులకు తాజాగా ఉద్వాసన పలికింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఓలా క్యాబ్స్‌, ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడింది. సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఎప్పటికప్పుడు పునర్‌నిర్మాణ చర్యలు తీసుకుంటున్నామని ఓలా తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని అవసరంలేని రోల్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజినీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. నైపుణ్యం ఉన్న సీనియర్‌ ఉద్యోగులను చేర్చుకుంటాని ఓలా తెలిపింది.

కంపెనీ వెయ్యి మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ఓలా గత సంవత్సరం ప్ర కటించింది. ఇందులో భాగంగా ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరింది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్‌ విభాగంపై దృష్టి సారించింది. మరికొన్ని వారాల పాటు పునర్‌నిర్మాణానికి సంబంధించిన కసరత్తులు కొనసాగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో కొనుగోలు చేసిన నియో బ్యాంకింగ్‌ సంస్థ అవైల్‌ ఫైనాన్స్‌ను ఓలా మూసివేసింది. దాన్ని ఓలా మనీలో విలీనం చేయాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement