Saturday, May 4, 2024

‘ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా.. స్మృతి మంధాన

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) 2021సంవత్సరానికి రాచెల్‌ ఫ్లింట్‌ ట్రోఫీ మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా స్మృతిమంధానను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. భారత మహిళా జట్టు స్టార్‌ ఓపెనర్‌గా పేరొందిన స్మృతి మందాన 2021లో అన్ని ఫార్మాట్లలో 22మ్యాచ్‌లు ఆడి 855పరుగులు చేసింది. వీటిలో ఓ సెంచరీ, 5హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో భారత మహిళాజట్టు దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా 8మ్యాచ్‌లు ఆడినా కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. భారతజట్టు గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కీలకపాత్ర పోషించింది. సఫారీజట్టు భారత పర్యటనలో భాగంగా జరిగిన రెండో వన్డేలో 158పరుగుల లక్ష్యఛేదనలో 80పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి భారత్‌ను గెలిపించింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20ను భారత్‌ గెలవడంలోనే స్మృతి 48రన్స్‌ నాటౌట్‌తో కీలకంగా వ్యవహరించింది. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఏకైక టెస్టు డ్రా అవడంలో స్మృతి 78పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి ప్రధానపాత్ర పోషించింది.

దీంతో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో ఓటమెరుగని భారత అజేయ రికార్డు సజీవంగా నిలిచింది. ఇంగ్లీష్‌ జట్టుపై గెలిచిన వన్డేలో స్మృతి 49పరుగులు చేసి ఆకట్టుకుంది. టీ20లో హాఫ్‌సెంచరీ నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో స్మృతి 86పరుగులుతో రాణించింది. అన్నిటికంటే ముఖ్యంగా కంగారూలతో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో సెంచరీతో సత్తా చాటింది. స్మృతి కెరీర్లో ఇదే తొలి శతకం. ఆ టెస్టులో 127పరుగులు చేసిన స్మృతి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. కాగా పురుషుల విభాగంలో ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిదీ ఎంపికయ్యాడు. అఫ్రిదీ 36 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 22.20సగటుతో 78వికెట్లు తీశాడు. 51పరుగులకు 6వికెట్లు పడగొట్టడం అతడి అత్యుత్తమ గణాంకం. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement