రాజస్థాన్లోని దేగానా సమీపంలోని నాగౌర్ ప్రాంతంలో భారీ లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. ఇవి జమ్ము కశ్మీర్లో కనుగొన్న నిక్షేపాల కంటే ఎన్నో రేట్లు ఎక్కువని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్), మైనింగ్ అధికారులు తెలిపారు. మొత్తం దేశ అవసరాల్లో 80 శాతం వరకు ఈ ఒక్క ప్రాంతంలో లభించే లిథియం తీరుస్తుందని తెలిపారు. వీటిని వెలికితీస్తే ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యానికి తెరపడుతుందని, మన దేశం చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిక్షేపాలతో రాజస్థాన్ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. లిథియంను ఛార్జబుల్ బ్యాటరీల తయారీలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, లాప్టాప్లు, వంటి వాటిలో లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశం లిథియం బ్యాటరీలకోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. రాజస్థాన్లోని దెగానా ప్రాంతంలో ఉన్న రెనావత్ హిల్స్ దాని పరిసరాల్లో అపారమైన లిథియం నిక్షేపాలు ఉన్నాయని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. 1914లోనే బ్రిటీష్ వారు ఈ కొండపై టంగ్సన్ ఖనిజాన్ని కనుగొన్నారు. టంగ్సన్తో బ్రిటిష్ వారు యుద్ధానికి కావాల్సిన కొన్ని రకాల వస్తువులను తయారు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ మెటల్ను సర్జికల్ పరికరాలను తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. 1992-93 సంవత్సరంలో చైనా తంగ్సన్ మెటల్ను తక్కువ రేటుకే ఎగుమతి చేయడంతో ఈ గనులు మూతపడ్డాయి.
అత్యంత తేలికగా ఉండే లిథియం ప్రస్తుతం బ్యాటరీల్లో ఉపయోగిస్తున్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదున లిథియంకు భారీ డిమాండ్ ఉంది. అందుకే దీన్ని ప్రస్తుతం వైట్ గోల్డ్గా పిలుస్తున్నారు. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో టన్ను లిథియం రేటు 57.36 లక్షలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు శిలాజ ఇంథనాలను తగ్గించుకుని, బ్యాటరీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీని వల్ల రానున్న కాలంలో లిథియంకు డిమాండ్ మరింత పెరగనుంది ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2050 నాటికి లిథియం డిమాండ్ 500 శాతం పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాజస్థాన్లోబయటన పడిన నిక్షేపాలను వెంటనే వెలికి తీస్తే మన దేశానికి ఎంతో ఉపయోపగడుతుందని, ఆర్ధికంగా కూడా దేశం వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాపడుతున్నారు.
ప్రస్తుతం బొలివియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 21 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నాయి. దీనితో పాటు అర్జెంటినా, చిలీ, అమెరికా దేశాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. చైనాలో 5.1 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం చైనానే ప్రపంచ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం మన దేశ అవసరాల్లో 53.76 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం ఆరు వేల కోట్ల విలువైన లిథియంను మన దేశం కొనుగోలు చేస్తుంటే, అందులో 3 వేల కోట్ల విలువైన దాన్ని చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాం.