Monday, May 6, 2024

హై అలర్ట్‌.. వందేళ్లలో గోదావరికి ఈస్థాయిలో వరద రాలే… ఇదే ఫస్ట్​ టైమ్​!

అమరావతి, ఆంధ్రప్రభ: గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా గోదావరికి ఈ స్ధాయిలో వరద రాలేదని, వరదల కారణంగా ఏ ఒక్కరూ మృత్యువాత పడకూడదని ఆ దిశగా అప్రమత్తం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉంటుందని, తొలిసారిగా జులై నెల లోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని ఇది జాగ్రత్త పడాల్సిన అంశం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందన్నారు. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంది బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని కాబట్టి ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని సీఎం ఆదేశించారు. వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని ఆ దిశగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయన్నారు. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్స్‌ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. 24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రోల్‌ రూంలు పనిచేసే విధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఎంఓ అధికారులు అందుబాటు లో ఉంటారని, వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాల్సిందిగా కలెక్టర్లకు సీఎం వైయస్‌.జగన్‌ సూచించారు.

ఖర్చుకు వెనుకాడొద్దు..
అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని ఏదైనా తేడా వస్తే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలని సీఎం చెప్పారు. శిబిరాల నుంచి వాళ్ళు వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఏర్పాట్లు , అధికారుల పనితీరు ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ నగదు తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి..
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటు లో ఉండాలని సీఎం ఆదేశించారు. అత్యవసర మందులను అందుబాటు లో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన సరుకులు నిల్వ ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు స్థానిక సంస్థల చైర్మన్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటు లో ఉంచుకోవాల్సిందిగా సూచించారు. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలని,చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, బోట్లు , లైఫ్‌ జాకెట్లు .. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాల్సిందిగా సూచించారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను కలెక్టర్లు సీఎంకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హోం,విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఇంధనశాఖ కార్యదర్శి కె విజయానంద్‌, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సివిల్‌ స్లఫస్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement