Thursday, May 2, 2024

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3.. ప్రయోగానికి సర్వం సిద్ధం, అర్ధరాత్రి 12.07 గంటలకు కౌంట్‌డౌన్

సూళ్లూరుపేట, (శ్రీహరికోట), ప్రభన్యూస్‌: భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు మరోసారి చాటి చెప్పే విధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సన్నద్దమయ్యింది. పూర్తి వాణిజ్య పరంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. న్యూస్‌ స్పెస్‌ ఇండియా లిమిటెడ్‌, వన్‌వెబ్‌ ఒప్పం దం ప్రకారం యుకేకు చెందిన 36 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనుంది. జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌తో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. తొలి సారిగా జీఎస్‌ఎల్‌ వీ -మార్క్‌ 3 రాకెట్‌ను వాణిజ్య పరంగా వినియోగించనున్న నేపథ్యంలో షార్‌లో హుషార్‌ మొదలయ్యింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ల్యాంచ్‌ ప్యాడ్‌ ఇందుకు వేదికగా మారనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ రిహార్సల్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. షార్‌లోని రాకెట్‌ అనుసంధాన భవనంలో రాకెట్‌ శిఖరభాగాన యుకేకు చెందిన 36 ఉపగ్రహాలను అమర్చి రెండవ ప్రయోగ వేదికపైకి జీఎస్‌ఎల్‌ వీ -మార్క్‌ 3 రాకెట్‌ను చేరవేశారు.

ఈ ప్రయోగానికి సంబం ధించిన రిహార్సల్స్‌ను విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలు ఆ డేటాను సేకరించారు. శుక్రవారం ఎంఆర్‌ఆర్‌ (మిషన్‌ రెడినెస్‌ రివ్యూ) సమావేశం నిర్వహించిన అనంతరం లాంచ్‌ ఆధరైజేషన్‌ బోర్డు సమావేశంలో రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చింది. అర్ధరాత్రి 12.07గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌండ్‌ డౌన్‌ను ప్రారంభించనున్నారు. 24 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. మూడు దశల రాకెట్‌లో మొదటి దశలో 200 టన్నుల ఘన ఇంధన స్ట్రాపన్‌ బూస్టర్లలో ఇంధనాన్ని నింపి ఉన్నారు. అదే విధంగా రెండవ దశలో 110 టన్నుల బరువు గల ధ్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉండగా ఈ ప్రక్రియను కౌంట్‌డౌన్‌ ప్రారంభించిన అనంతరం చేపట్టనున్నారు. మూడవ దశలోని 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంజన్‌లో క్రయో ఇంధనాన్ని నింపి ఉన్నారు. వాహనంలో ఇంధనాన్ని నింపిన అనంతరం ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలో పాటు భూస్థిర పరీక్షలను నిర్వహించి రాకెట్‌ను పూర్తిస్థాయిలో ప్రయోగానికి సిద్దం చేయనున్నారు.

శనివారం అర్థరాత్రి 12.07గంటలకు కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే రాకెట్‌ తన గమనాన్ని ప్రారంభించనుంది. 19.07 నిమిషాలలో ప్రయో గాన్ని పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టి ఉన్నారు. ఈ క్రమంలో రాకెట్‌ అగ్రభాగాన ఉంచిన 5200 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశపెట్టిన వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌం డ్‌ స్టేషన్‌ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రిం చనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement