Monday, April 29, 2024

బాలికను వివాహం చేసుకున్న తాతయ్య

ఓ 16 ఏళ్ల బాలికను 65ఏళ్ల వయసు గల తాతయ్య పెళ్లి చేసుకున్న ఘటన దక్షిణ బ్రెజిల్ లో చోటుచేసుకుంది. 65 ఏళ్ల ముసలి మేయర్ 16 ఏళ్ల పడుచు పిల్లని వివాహం చేసుకుని ఇరకాటంలో పడ్డాడు. పిల్లనిచ్చిన అత్తగారి మెప్పుపొందడానికి పెళ్లైన మరుసటి రోజే ఉన్నత ఉద్యోగంలో పదోన్నతి కల్పించారు. బంధుప్రీతితో పదోన్నతులు కల్పించడంతో.. అది కాస్తా తీవ్ర దుమారం లేపింది. దీంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. వివరాల్లోకెళ్తే..

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా మునిసిపాలిటీకి హిస్సామ్ హుస్సేన్ దేహైనీ (65) మేయర్‌గా రెండోసారి కొనసాగుతున్నారు. గతేడాది మేయర్‌ తన రెండో భార్యకు విడాకులిచ్చారు. ఆ తర్వాత కౌనే రోడ్ కమర్గో అనే 16 ఏళ్ల యువతిని గత నెలలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. హైస్కూల్‌ విద్యార్థి అయిన కౌనే గత ఏడాది టీన్ విభాగంలో (15 నుండి 17 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ అందాల పోటీ నిర్వహిస్తారు) మిస్‌ అరౌకారియా అందాల పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరినైనా తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు. దీంతో కౌర్‌కు 16 ఏళ్లు నిండిన మరుసటి రోజే మేయర్‌ హిస్సామ్‌ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 12న వీరి వివాహం జరుగగా.. ఆ మరుసటి రోజే కౌనే తల్లి మారిలీన్ రోడ్‌ను సాంస్కృతిక కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. అప్పటి వరకు విద్యాశాఖలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న మారిలీన్ రోడ్‌కు కొత్త అల్లుడు ప్రమోషన్‌ ఇచ్చి పెద్ద హోదా ఉద్యోగం కల్పించాడు. బంధుప్రీతితో కుటుంబ సభ్యులకు పదోన్నతులు కల్పించడాన్ని అక్కడి డిప్యూటి మేయర్ సీమీ బయట పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ముసలి పెళ్లి కొడుకు ఇరుకున పడ్డాడు. మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపైన విచారణ సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. కాగా గర్ల్స్ నాట్ బ్రైడ్స్ అనే సంస్థ ప్రకారం.. బ్రెజిల్‌లో 2.2 మిలియన్లకు పైగా మైనర్లు వివాహం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement