Sunday, April 28, 2024

తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో గూండాల రాజ్యం : రేవంత్ రెడ్డి

హనుమకొండ టౌన్ : తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వినయ్ భాస్కర్ కనుసన్నల్లోనే పవన్‌పై దాడి చేయించారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రౌడీల అరచకాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు అని ఫైర్ అయ్యారు. గంజాయి బానిసలు మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం ల్యాండ్, సాండ్, మైన్, అటెంప్ట్ రేప్‌లలో కూడా బీఆర్ఎస్ నేతలే ఉంటున్నారని తెలిపారు. రాజకీయంగా వారికి నూకలు చెల్లాయనే ఎమ్మెల్యే ముఠా పవన్‌ను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన పవన్ చావు నుంచి తప్పించుకున్నాడని పేర్కొన్నారు. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గం అని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధి నిర్వర్తించడం లేదన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తనపై దాడి జరిగిందని పవన్ చెప్పినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేపై, అతని ముఠా సభ్యులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారిని కాపాడుతున్నారన్నారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదన్నారు. క్రిమినల్ చర్యలను ఉక్కు పాదంతో అణచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా పోలీసులు నిస్సహాయంగా ఉండటం మంచిది కాదన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన కాదు.. మా యాత్రపైనే దాడి జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. పర్యవేక్షించాల్సిన డీజీపీ వైపు నుంచి స్పందన లేదన్నారు. ఈ దాడిని కాంగ్రెస్ శ్రేణులు సహించవన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాలని కోరారు. ఈ నిరసన సెగ కేసీఆర్‌కు తగలాలన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అతని గంజాయి ముఠాపై హత్యానేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కరే కారణమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement