Monday, April 29, 2024

దావోస్‌ తో భవిష్యత్‌కు పునాది.. కలిసొచ్చిన ప్రపంచ ఆర్థిక సదస్సు

అమరావతి, ఆంధ్రప్రభ: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుతో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. గత రెండేళ్లుగా కోవిడ్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటన కలిసొచ్చిన అంశం. ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో లక్షా 25వేల కోట్ల మేర పెట్టుబడులకు ముందుకు రావటం విశేషం. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కర్బన ఉద్గార రహితంగా అభివృద్ధిని – పర్యారణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ రాష్ట్రాన్న్రి శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం చక్కటి ఫలితాలను సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దావోస్‌ వేదికను రాష్ట్రం వినియోగించుకుంది. విఖ్యాత కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. నాలుగోతరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్న్రి మార్చేందుకు అవసరమైన గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించే రూ.1,25,000 కోట్ల పెట్టబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదర్చుకుంది. పంప్డ్‌ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రానుంది. గ్రీన్‌కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్‌ ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్‌, రవాణా, ప్యాకేజీంగ్‌ తదితర రంగాల్లో ఉన్న ఆర్సెలర్‌మిట్టల్‌ గ్రూపుకు వార్షిక ఆదాయం76.571 బిలియన్‌ డాలర్లు. ఈ కంపెనీ రాష్ట్రంలోకి తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీకి వేదికగా చేసుకుంది. కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్‌, అమ్మెనియా ఉత్పత్తులపై దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్‌ సీఈఓ సైతం కితాబిచ్చారు. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఈజెడ్‌ను తీసుకురానుండడం దావోస్‌ ఫలితాల్లో ఒకటి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్దతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈజోన్‌ను అభివృద్ధిచేస్తారు. కాలుష్యాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడం, నాణ్యత పెంచుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వంలో దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రాన్రికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది.
రాష్ట్రంలోకి కొత్తగా 4 పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్‌ సభలో సీఎం దృష్టిపెట్టారు.దస్సాల్ట్‌ సిస్టమ్స్ ఒ.ఎస్‌.కె.లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో సీఎం ఇవే అంశాలను ప్రస్తావించారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు- పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్‌ రంగాల్లో భాగస్వామ్యానికి సుముఖత వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో ఈ సంస్థ సరుకు రవాణా చేస్తోంది. కాగా రాష్ట్రంలోనే అతిపెద్దనగరం, ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికచేసుకున్న విశాఖపట్నంకు దావోస్‌వేదికగా ప్రత్యేక గుర్తింపు లభించింది. హై ఎండ్‌ టెక్నాలజీ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించి పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షింపచేశారు. ఈ రంగంలో పెట్టబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్‌ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపై కూడా చర్చించారు. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్‌ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత వెల్లడించారు. ఐబీఎం ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. యూనికార్న్‌ స్టార్టప్స్‌ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం జగన్‌ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కానున్నాయి. వివిధ ప్రముఖ సంస్థల వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ ప్రకటించింది. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్‌ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ ప్రకటించింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్‌ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు. దావోస్‌వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో రాష్ట్రం తన ప్రగతిని వినిపించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ పై పబ్లిక్‌ సెషన్‌లోపాల్గొన్న సీఎం కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి విప్లవాత్మకంగా చేపడుతున్న మార్పులను వివరించారు. కోవిడ్‌ లాంటి విపత్తను ఎవ్వరు కూడా ఊహించలేదని, వెద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, అందరి స్తోమతకూ తగినట్టుగా ఉండాలని సీఎం దావోస్‌ వేదికగా పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement