Wednesday, May 1, 2024

దమ్ముంటే చర్చకు రా.. హరీష్ రావుకు ఈటల సవాల్

హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎదురుదాడికి దిగారు. మంత్రి హరీష్ రావువి మోసపుమాటలు, మొసలి కన్నీరు అని అన్నారు. ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్ మంత్రి అయిన మీరు తన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు ఎకరాలకు 200 ఎకరాల మధ్య పోటీ అంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులపై విచారణ జరపాలని అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని ఈటల సవాల్ విసిరారు. ఎవరు సంపాదన ఏంతో తేలిపోతుందన్నారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్ధాంతపరమైన విమర్ళలు చేయాలన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అబద్దాల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ను మించిపోయారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల మాటలను తెలంగాణ సమాజం నమ్మదని పేర్కొన్నారు. ” హుజురాబాద్ కు నేనేం చేయలేదంటూన్నారు.. కానీ మరు వెళ్తున్న రోడ్లు నా హయంలో వేసినవే. అభివృద్ధి విషయంలో మీకెంత సోయి ఉందో.. నాకూ అంతే సోయి ఉంది. సిద్ధిపేట, గజ్వేల్ అంత అభివృద్ధి కాకపోయినా ఉన్నంతలో హుజురాబాద్ ను అభివృద్ధి చేశా” అని ఈటల వ్యాఖ్యానించారు.

”హరీశ్ రావు ఎంత చేసిన మీ మామ నిన్ను నమ్మడు. ఏనాటికైనా ఈ పార్టీని కాప్చర్ చేస్తా అనుకుంటున్నావు. కానీ మీ మామ బ్రతికుండగానే టిఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మిమ్ముల్ని ఎవరూ నమ్మరు. మీ చేతికి వచ్చే లోపు ఆ పార్టీ ఖతం అవుతుంది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే హరీష్ రావుకు చరిత్ర మిమ్ముల్ని క్షమించదు. చిల్లర ఆరోపణలు, చౌక బారు ప్రచారాలు చేయవద్దు. ఇలా చేసి పలచపడకు. ధర్మానికి, న్యాయానికి విరుద్దంగా పని చేస్తే మీకు కూడా అదే గతి పడుతుంది. 18 సంవత్సరాల అనుబంధం మనది. అవన్నీ మర్చిపోయి మీ మామ దగ్గర మార్కులు కొట్టడానికి ఇలాంటి పనులు చేయవద్దు.  మీ మోసపుమాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరు. దుబ్బాకలో లాగా కర్ర కాల్చి వాత పెడతారు. ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన వాడివి నువ్వు.

మీ మామ నియోజకవర్గంలో నువ్ వరుసగా గెలుస్తున్నావు.. కాని నేను ఒక్క అవకాశం ఇస్తే ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడిని. హుజూరాబాద్ లో అభివృద్ది జరగలేదు అంటున్నారు. నువ్ నిన్న తిరిగిన అన్నీ రోడ్లు 4 లైన్ రోడ్డు వేయించింది నేనే. గతంలో 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. ఈ రోజు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు. 3,900 ఇండ్లు హుజూరాబాద్ లో మంజూరు అయ్యాయి. 500 జమ్మికుంటలో, 500 హుజూరాబాద్లో, 500 కమలాపూర్ లో కట్టించాను. ఇంకో 500 ధర్మారం, కోరుకల్,  చిన్న ముల్కనూర్ లో కట్టించా. సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ లు కడుతుంది కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్స్ కదా’’ అని ఈటల అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మర్చేశానని తెలిపారు. నియోజకవర్గంలో 18 చెక్ డామ్ లు, 1050 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగుచేయించానని తెలిపారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు 40 కోట్ల రూపాయలు ఒక్కోదానికి మంజూరు చేస్తే డబ్బులు ఇవ్వకుండా ఆపింది మంత్రి కేటీఆరేనని ఆరోపించారు. మళ్ళీ ఇవే డబ్బులు ఇప్పుడు మంజూరు చేసామంటూ GO ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పటికీ 192 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో ఖర్చు పెట్టారని తెలిపారు. తనతో పాటు 11 మంది సొంత నేతలు ఓడించడానికి సీఎం కేసీఆర్ డబ్బులు ప్రతిపక్షం నేతలకు ఇచ్చారని ఈటల ఆరోపించారు.

రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్ లు అన్నీ టాప్ అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 శాతం మంది జనాభా ఎస్సీలకు మంత్రి పదవులు ఉన్నవి ఎన్ని? వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. మూడు సార్లు ప్రగతి భవన్ గేట్ల దగ్గర మమ్ముల్ని ఆపారని, 2016 నుండే బానిస బ్రతుకులు మొదలయ్యాయని తెలిపారు. మంత్రులకు కూడా సీఎం దగ్గర అపాయింట్మెంట్ లేదని ఆపితే.. ఇదే కరీంనగర్ మంత్రి ఇంత అహంకారమా ? ఇంత దొరతనమా ? కరీంనగర్ నుండే మళ్ళీ ఉద్యమం రావాలి అని గంగుల కమలాకర్ చెప్పిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని పెట్టుకో అని ట్యాబెట్లు ఇచ్చే ఎంపి సంతోష్ కుమార్ కి ఆనాడే చెప్పానని పేర్కొన్నారు.  

- Advertisement -

పదవి కంటే తనకు ఆత్మ గౌరవం గొప్పదన్నారు. దమ్ము ఎవరికి ఉందో తెలుసుకోండని సవాల్ విసిరారు. వందల కోట్లుతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వాడిగా కెసిఆర్ పేరు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. డబ్బులు ఖజానాలో నిండుగా ఉంటే మధ్యాహ్న భోజనం పథకం వారికి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎందుకు జీతాలు 20వ తేదీ వరకు ఇస్తున్నారని నిలదీశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో భోజనం ఎందుకు పెట్టలేక పోతున్నారని ఈటల రాజేందర్ అడిగారు.

ఇది కూడా చదవండి: జానారెడ్డికి ప‌ట్టిన గ‌తే ఈట‌ల‌కు: తలసాని

Advertisement

తాజా వార్తలు

Advertisement