Saturday, July 27, 2024

TS | కష్టాల కాంగ్రెస్.. రద్దయిన నోటు కేసీఆర్ : ఈటెల

జనగామ, ప్రభ న్యూస్ : కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు రైతులకు కష్టాలు వస్తాయని.. కేసీఆర్‌ రద్దయిన నోటులాంటి వారని, అందుకే దేశ సంక్షేమం కోసం రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఆశీర్వదించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

జనగామ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజల కష్టసుఖాల గురించి ఆలోచిస్తున్నారని, పేదలకు అండగా ఉంటూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి నిరంతరం సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు.

దేశంలోనే భాజపా ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజాసమస్యలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిపోయే కరెంటు, నీటి ఎరువు లేకపోవడంతో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఏడు లక్షల చొప్పున నిధులు కేటాయించి నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీది అని అన్నారు. అందుకే దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసేందుకు సిద్ధం కావాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement