Sunday, May 5, 2024

దళిత ద్రోహి జగన్ : నారా లోకేష్

కర్నూలు (డోన్) బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం కార్యక్రమంలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఎన్ఎస్ఎఫ్డీసి పథకం కింద గత ప్రభుత్వంలో స్వయం ఉపాధికి అనేక అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులకు ఇన్నోవాలు, జేసీబీలు అందించామన్నారు. ఇప్పుడు ఆ పథకం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన వచ్చిన తరువాత బిజినెస్ లేదు. పైగా కరోనా దెబ్బతో ఈఎంఐలు కట్టలేని దుస్థితి నెలకొందన్నారు. దళితులకు స్మశాన వాటికలు కూడా లేవన్నారు. ఉన్న స్మశాన భూమిని కూడా వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి హయాంలో జరిగిన వర్గీకరణ వలన దళితుల్లో అన్ని ఉప కులాలకు న్యాయం జరిగింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు వలన మాకు నష్టం జరిగింది. టిడిపి అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని వైసిపి ప్రభుత్వం వెనక్కి తీసుకుంద‌ని రమణమ్మ అనే మహిళా లోకేష్ తో వాపోయారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. దళితుల భూముల్ని వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారన్నారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ పేరు తొలగించారు. మళ్లీ పథకం ప్రారంభించి అంబేద్కర్ పేరు పెట్టాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

డోన్ నియోజకవర్గం ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేష్‌…
లోకేష్ మాట్లాడుతూ 2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. వైఎస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు కదా అని దళిత ప్రతినిధులతో ముఖాముఖిలో లోకేష్ మాట్లాడారు. సుప్రీం కోర్టు పార్లమెంట్ లో చట్టం ద్వారా వర్గీకరణ చెయ్యాలని డైరెక్ట్ చేసింది. కానీ ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు జీఓ 25 తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల అమలులో వర్గీకరణ తీసుకొచ్చారన్నారు. ఏ ప్రాంతంలో, ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా జీఓ 25 చంద్రబాబు తీసుకొచ్చిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. జీఓ 25 వలనే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ వీటికి అధికార పార్టీ వైసిపి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదనన్నారు. టిడిపి సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది. దళితుల్లో ఉన్న 62 ఉప కులాలకు న్యాయం చేస్తాం అన్నారు. తాను తన జీవితంలో మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఒక దళిత యువతి కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకే అన్నారు. గుంటూరులో రమ్య అనే దళిత యువతిని ఒక మృగాడు నడి రోడ్డు మీద హత్య చేసాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారన్నారు. రమ్య కుటుంబానికి రూ.5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండో సారి స్టేషన్ కి వెళ్లడం జరిగిందన్నారు. కావ‌లిలో వైసిపి నాయకులు వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే టిడిపి ఆదుకుందన్నారు. రూ. 15 లక్షల ఆర్ధిక సాయం అందించి తనఖాలో ఉన్న ఇల్లు విడిపించి కుటుంబానికి అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత యువతి స్నేహ‌లతను చంపేస్తే టిడిపి పోరాడింది అన్నారు. వారి కుటుంబానికి రెండు లక్షల ఆర్ధిక సాయం అందించామన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక దళిత మహిళ పై అత్యాచారం జరిగితే ఆమెకు న్యాయం చెయ్యాలి అని టిడిపి పోరాడింది. ఆమెకు రూ.2 లక్షల ఆర్ధిక సాయం చేసిన విషయం గుర్తు చేశారు. ఎన్ఎస్ఎఫ్డీసి పథకం ద్వారా ఇన్నోవాలు, జేసిబిలు పొందిన వారు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ పాలన, కరోనా కారణంగా ఇబ్బంది పడిన లబ్దిదారులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటుందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీ భూమి నీకు అందిస్తాం అంటూ రమణమ్మకు లోకేష్ హామీ ఇచ్చారు. స్మశానం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల స్మశానం కోసం ప్రత్యేక భూములు కేటాయించినట్లు తెలిపారు.

జగన్ దళిత ద్రోహి..
వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రమణ్యంని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సన్మానం చేసి పాలాభిషేకం చేశారు.
సుబ్రమణ్యం కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలని పోరాడిన తెదేపా ఎస్సీ నాయకుడు ఎంఎస్ రాజు, దళిత నాయకుల పై జగన్ ప్రభుత్వం లాటిఛార్జ్ చేయించిందన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళ నాగమ్మను కిరాతకంగా హత్య చేస్తే టిడిపి నాయకులు పోరాడారు. పోరాడిన ఎస్సీ నాయకులు ఎంఎస్ రాజు, అనిత పైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు భూమి కేటాయింపు కార్యక్రమం మళ్ళీ ప్రారంభించినట్లు చెప్పారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. విదేశీ విద్య పథకం కి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గం అయిందిగా అభివర్ణించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తామన్నారు. జగన్ పేరు తొలగించి అంబేద్కర్ పేరును పెడతామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం పై చర్చిస్తున్నాం. త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. దళితుల పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీని పై విచారణ చేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. టిడిపి పరిపాలనలో ఎప్పుడూ ఎస్సీల పై దాడులు జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తాం. దళితులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఘోరమైన పరిస్థితి ఉంది. దీనిపై టిడిపి పోరాటం చేస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్ఫేర్ హాస్టల్స్ ని మెరుగుపరుస్తామని లోకేష్ పేర్కొన్నారు. తెదేపా హయాంలో ఎస్సీ ల కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయి అన్నారు. ఎస్సీలకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కావున దళితులు అంతా ఎవరి హయాంలో న్యాయం జరిగిందో అర్దం చేసుకోవాలని నారా లోకేష్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement