Saturday, May 4, 2024

తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విమానయాన రంగంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ సర్కార్‌కు సూచించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ అనుసంధానతకు సహకరించాలని కేంద్రం కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని ఆయన ఆరోపించారు. సాంకేతిక, భూపరీక్షల ఆమోదం పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

అన్ని రకాల అనుమతులు ఉన్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల నిర్మాణం తదతర అంశాలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ పలుమార్లు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేఖ రాసినా కేసీఆర్ నుంచి స్పందన రాలేదన్నారు. మూడు విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలంటూ తాను రాసిన లేఖకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన రాకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవకరద్ర (మహబూబ్ నగర్), మమ్నూరు (వరంగల్), బసంత్ నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అధ్యయనాలు చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని కిషన్ రెడ్డి లేఖలో గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ఇవ్వమని అడిగితే ఎటువంటి స్పందన రాకపోగా, బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో కేంద్రప్రభుత్ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 140 దాటిందని, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పని చేస్తోందని లేఖలో వివరించారు. విమానయాన రంగంలో ఉన్నటువంటి ఈ సానుకూలమైన  వాతావరణాన్ని సద్వినియోగ పరచుకుని తెలంగాణలోనూ విమానాశ్రయాల పెంపుపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రబుత్వానికి ఆయన హితవు పలికారు. ఈ దిశగా సంపూర్ణ సహకారానికి పౌర విమానయాన శాఖ ఇదివరకే సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని లేఖ ద్వారా కిషన్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement