బెంగళూరు: కర్నాటక అసెంబ్లి ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ శిబిరంలో కార్యకలాపా లు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో ’50:50′ ఫార్ములాతో పార్టీ అధిష్ఠానం సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి పదవికి అసెంబ్లి లో విపక్ష నేత సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రధానంగా పోటీపడుతు న్నారని తెలిపాయి. వారిద్దరి మధ్య నువ్వా నేనా రీతి లో నడుస్తున్న తీవ్రమైన పోటీని పరిగణనలోకి తీసు కొని అనవసరమైన అయోమయానికి తావులేకుండా ’50:50′ ఫార్ములాతో పార్టీ అధిష్ఠానం ముందుకు వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికార దండాన్ని అప్పగించే సంప్రదా యాన్ని కాంగ్రెస్ పార్టీ అనాదిగా అనుసరిస్తున్నప్పటికీ, సిద్ధరామయ్య కారణంగా ఈసారికి ఆ సంప్ర దాయాన్ని పార్టీ అధిష్ఠానం పక్కన పెడుతున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో కాబోయే ఎమ్మెల్యేల మద్దతు ను కూడగట్టుకోవడం కోసం సిద్ధరామయ్య, శివ కుమార్ వర్గాలు ఇప్పటికే తలమునకలై ఉన్నాయి.
మాజీ ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్జేను బెంగళూరులోని ఆయన నివాసంలో కలుసుకొని చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖర్గేతో సీఎం పదవి గురించి చర్చించలేదని పరమేశ్వర అన్నారు. ”ఈ విషయంపై(సీఎం పదవి) మాట్లాడటం ద్వారా నేనెలాంటి అయోమయాన్ని సృష్టించాలనుకోవడం లేదు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది” అని తెలిపారు. మరోవైపు లింగాయత్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందిన పక్షంలో లింగాయత్ ఎమ్మెల్యేను సీఎంను చేయాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్ఠానం ముందు ఉంచినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత షమనూరు శివశంకరప్ప తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లింగాయత్ సామాజిక వర్గానికి 51 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. అయితే ఎవరికీ నొప్పి కలుగకుండా సిద్ద రామయ్యను రెండున్నర ఏళ్లు,డికె శివకుమార్ను రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అధిష్టానం ఆలోచనగా ఉంది.. అలాగే తొలి రెండున్నర ఏళ్లలో డికె ను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని రాహుల్ ఆలోచన. అయితే రేపు జరిగే సిఎల్పీ సమావేశంలోనే మెజార్టీ ఎమ్మెల్యే ల అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖార్గేల భావిస్తున్నారు..