Tuesday, May 7, 2024

ఏపీలో అన్నయోజన అమలుపై కేంద్రం సమాధానం తప్పుగా ఉంది.. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం కింద జరుగుతున్న ఆహారధాన్యాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో అన్న యోజన పథకం అమలుపై తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జాతీయ ఆహార భద్రతపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తప్పుగా ఉందని భరత్ అన్నారు. ఆహార భద్రత-ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్రమే రాష్ట్రానికి బియ్యం కేటాయిస్తుందని, ఏపీలో ఎటువంటి అవకతవకలు లేకుండా బియ్యం పంపిణీ జరుగుతోందని వివరించారు.

నిజానికి కేంద్రం ఇచ్చిన బియ్యం కంటే రాష్ట్రప్రభుత్వం అదనంగా పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారధాన్యాలు, రేషన్ పంపిణీ జరుగుతోందని మార్గాని భరత్ అన్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాల కింద జనాభాలో 76 శాతం మందికి కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి కేవలం 60 శాతం మందికి మాత్రమే కేంద్రం ఆహార ధాన్యాలు అందిస్తోందని మార్గాని భరత్ అన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తుచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement