Wednesday, May 15, 2024

Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టే…

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బిఆర్ఎస్, బిజెపి అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ఈ సమాజానికి చీడ అని నిన్నటి వరకు ప్రతి సందర్భంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గవర్నర్ తో కలిసి వెళ్లి వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదు. రెండు ఒకటేనని, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో నువ్వు కొట్టినట్టు, తిట్టినట్టు చెయ్యి.. నేను ఏడ్చినట్టు చేస్తా అని రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న వారి కుట్రపూరిత ఆవ లక్షణాలను కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే బయటపెట్టామ‌న్నారు. నిన్నటితో అది నిజమని తేలిపోయిందన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు గవర్నర్ తో కలిసి మాట్లాడటం కానీ, ఎదురుపడటానికి కానీ ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు సయోధ్య కుదుర్చుకొని, బేరం కుదుర్చుకొని, చిరునవ్వులు నవ్వుతూ గవర్నర్ తో కలిసిపోవడం తెలంగాణ సమాజానికి కేసీఆర్ గురించి సంపూర్ణంగా అర్థమైందన్నారు.

బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ గురించి తెలంగాణ సమాజానికి సంపూర్ణంగా అర్థమైందన్నారు. నిరంకుశ నియంత్రత్వ పోకడలతో ఫాసిస్టు పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లను వదిలించుకోకుంటే భావ స్వేచ్ఛ ఉండదని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. నిరంకుశ నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్న మోడీ, కేసీఆర్ లు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేయడంలో భాగంగానే ఇద్దరు కలిసి ప్రొఫెసర్ హారగోపాల్, తదితరులపై కుట్రపూరితంగా దేశ ద్రోహం (ఉపా) కేసులో ఇరికించారన్నారు. దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా హరిస్తున్న బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. ప‌దేళ్ల‌ కేసీఆర్ పరిపాలనలో అవినీతి అక్రమాలు, ధరణితో భూ కుంభకోణం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ అక్రమాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల అమ్మకాల అవినీతి, కాలేశ్వరం అవినీతి, లిక్కర్ స్కాం అవినీతి చిట్టా ఉందని మాట్లాడిన అమిత్ షా, మోడీలు చట్టపరంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాటలకే పరిమితమయ్యారని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement