Saturday, May 4, 2024

బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ : మంత్రి హరీశ్‌ రావు

బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని, చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కార్మికుల పొట్టకొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని టెస్కో కార్యాలయంలో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ సమక్షంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రద్దులు చేసిన ఘనత బీజేపీది.. పద్దులు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ది అని వ్యాఖ్యానించారు. చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నదని చెప్పారు. రూ.350 కోట్ల నిధులతో బతుకమ్మ చీరల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లిచ్చామన్నారు. మరమగ్గాల ఆధునీకరణ కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించామని వెల్లడించారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా తీసుకొచ్చామని, రూ.5 లక్షలు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేత కార్మికులకు భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మోడల్ అని తెలిపారు. అప్పటి పాలకులు బాపూజీని అవమానించారని, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం కల్పించిందన్నారు. దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చారో కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైల్వేలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. దేశంలో బీమాకు మారుపేరు ఎల్‌ఐసీ అని.. దానిని ఎందుకు అమ్మాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement