Monday, April 29, 2024

ఇంజనీరింగ్‌ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తి.. 32 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ రెండో విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అయినా ఇంకా 12 వేల ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలినయ్‌. చాలా కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్లు నిండనేలేదు. రాష్ట్రంలో మొత్తం 174 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో 16 యూనివర్సిటీ కాలేజీలు కాగా 2 ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 156 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 174 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేవలం 32 కాలేజీల్లో మాత్రమే వందకు వంద శాతం ఇంజనీరింగ్‌ సీట్లు నిండాయి. అందులో నాలుగు యూనివర్సిటీ కాలేజీలు ఉండగా, 28 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -

మిగిలిన 142 కాలేజీల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండనేలేదు. అదేవిధంగా జులై 16న ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ మొదటి విడుత సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. మొదటి విడుతలతోనే 31 కాలేజీల్లో వందకు వంద శాతం ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయి. ఆ 31కాలేజీల్లో 3 యూనివర్సిటీలు కాగా 28 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. సోమవారం ప్రకటించిన రెండో విడుత సీట్లలో వంద శాతం సీట్లు నిండిన కాలేజీ ఒకటి మాత్రమే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికీ కేవలం ఒక యూనివర్సిటీ కేలీజీలో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక తెలంగాణ రెండో విడతలో మొత్తం 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.

ఇక 25,148 మంది విద్యార్థులు తమ సీట్లను మార్చుకున్నారు. రెండో విడుత సీట్ల కేటాయింపుల తర్వాత ఇంకా 12,013 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని కన్వీనర్‌ సూచించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి తుది విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 78.03 శాతం, సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 43.48 శాతం సీట్లు నిండగా, ఇతర ఇంజనీరింగ్‌ కోర్సుల్లో కేవలం 60.02 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 82,702 కన్వీనర్‌ కోటా సీట్లకు మొదటి, రెండో విడుతలో కలిపి 70,689 సీట్లు భర్తీ కాగా, ఇంకా 12013 సీట్లు మిగిలాయి.

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇలా…

ఇంజనీరింగ్‌ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్‌ అవుతుందన్నారు. అయితే ట్యూషన్‌ ఫీజు చెల్లించే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే రీఫండ్‌ చేసేందుకు సులభంగా ఉంటుందని కన్వీనర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement