Tuesday, May 14, 2024

Delhi | తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటాం.. విద్యుత్ బకాయిల అంశంపై కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టులో అనుకూలంగా వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసిందని మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ జెన్‌కో ద్వారా తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసింది. ఈ మేరకు తెలంగాణ చెల్లించాల్సిన రూ. 6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్ల అసలుతోపాటు రూ. 3,315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్‌చార్జీలు రూపంలో చెల్లించాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై జారీ చేసిన ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు 2023 అక్టోబర్ 19న తీర్పు వెలువరించిందని మంత్రి పేర్కొన్నారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగులో ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement