Wednesday, May 1, 2024

కలవరపెడుతున్న కొత్త వైరస్‌, 9 మంది మృతి.. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతుందని, మళ్లీ కరోనా ముందునాటి పరిస్థితులు ఏర్పడాలని ఎదురుచూస్తున్న ప్రపంచాన్ని.. మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఘనాలో తాజాగా ఓ కొత్త వైరస్‌ బయటపడింది. ఈ వైరస్‌ సోకి ఇప్పటికే 9మంది మృతి చెందారని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వైరస్‌ను ‘మార్‌బర్గ్‌’ గా గుర్తించారు. ఘనాలో రోజురోజుకూ మార్‌బర్గ్‌ కేసులు పెరిగిపోతుండటంతో, డబ్ల్యూహెచ్‌ఓ వైరస్‌ వ్యాప్తిని, ముప్పును అంచనా వేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

మార్‌బర్గ్‌ వైరస్‌ ప్రాణాంతకమైనదేనని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఈ వైరస్‌ కు వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో లేదని వెల్లడించింది. కాగా, ఈక్వటోరియల్‌ గినియాలో మార్‌బర్గ్‌ వైరస్‌ బారిన పడి తొమ్మిది మంది చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇదొక అంటు వ్యాధి అని తేల్చి చెప్పింది.

కొత్త రూపంలో వచ్చిన మార్‌బర్గ్‌ వైరస్‌ సోకిన వారిని తాకడం, వారి రక్తంతో పాటు ఇతర శరీర ద్రవాల ద్వారా, వారు నిద్రించిన ప్రదేశంలో పడుకోవడం, వారు వాడిన దుస్తుల్ని వాడటం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. అయితే.. పీల్చే గాలిద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. ఇది ఎబోలా వ్యాధిని పోలి ఉంటుందని తెలిపింది. గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి వైరస్‌ మనుషులకు సోకుతుందని, మరణాల శాతం 88గా ఉంటు-ందని పేర్కొంది. తీవ్రమైన తలనొప్పి, అలసట, జ్వరం వంటి లక్షణాలు వైరస్‌ సోకిన వారిలో కనిపిస్తాయని డబ్లూహెచ్‌వో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement