Wednesday, May 15, 2024

ఆర్బీఐ చర్యలతో మొండి బకాయిలు 8.6 లక్షల కోట్లు వసూలు..

ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యల మూలంగా గత 8 సంవత్సరాల్లో బ్యాంక్‌లు 8.6 లక్షల కోట్లు మొండి బకాయిలను వసూలు చేయకలిగాయని ప్రభుత్వం తెలిపింది. సోమవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితులు, సంస్థాగత సమస్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భారీగా రుణాలు ఇవ్వడం, రిస్క్‌ను సరిగా అంచనా వేయలేకపోవడం, పేవలంగా ఉన్న రుణాల చెల్లింపులు ఇలా అనేక కారణాల వల్ల బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయని చెప్పారు. ఇవి బ్యాంక్‌ల పనితీరుపైనా, ఆర్థిక నిర్వాహణపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. దీర్ఘకాలంగా మొండి బకాయిలుగా ఉన్న వాటి
విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు సరైన మార్గదర్శకాలు , సూచనలు, ఆదేశాలు ఇవ్వడంతో గత 8 సంవత్సరాల్లో బ్యాంక్‌లు బకాయిలను బ్యాంక్‌లు వసూలు చేసుకోకలిగాయని వివరించారు. ఈ విషయంలో అందుబాటులో ఉన్న నిబంధనలు, చట్టాలను ఉపయోగించి 8,60,369 కోట్ల రూపాయిల బకాయిలను వసూలు చేసిన ట్లు తెలిపారు.
బ్యాంక్‌లు ఇస్తున్న రుణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సెంట్రల్‌ రిపోసిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)ని ఏర్పాటు చేసింది. 5 కోట్లకు పైగా ఉన్న రుణాల వివరాలను ప్రతి బ్యాంక్‌ ఆర్బీఐ ఏర్పాటు చేసిన సీఆర్‌ఐఎల్‌సీకి ప్రతివారం పంపించాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా బ్యాంక్‌ రుణాలు ఎగవేతకు పాల్పడిన వ్యక్తులు, సంస్థలు, కంపెనీలను క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి నిధులు సేకరించకుండా నిషేధం విధించడం జరుగుతుందని మంత్రి వివరించారు. దీనింతో పాటు డెబిట్‌ రికవరీ ట్రిబ్యూనల్‌(డీఆర్‌టీ) పరిధిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం వల్ల పెద్ద మొత్తంలో మొండి బాకీలను వసూలు చేసేందుకు వీలు కలిగిందని మంత్రి వివరించారు. కొత్తగా ఆరు డీఆర్‌టీలను ఏర్పాటు చేయడం వల్ల కూడా బాకీలు వసూలు పెరిగినట్లు వివరించారు. రుణాలు ఇచ్చే సంస్థలు అన్ని తప్పనిసరిగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీస్‌(సీఐసీ)లో సభ్యులుగా చేరాల్సి ఉంఉంది. ఈ సంస్థలు తప్పనిసరిగా రుణాల వివరాలు, రుణాలు తీసుకున్న వారి పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఇతర సంస్థలతోనూ పంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల బాకీల ఎగవేతను నిరోధించేందుకు సహయపడుతుందని మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement