Saturday, April 27, 2024

30,275 కోట్ల రుణ అనుమతి ! కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల వేట ఒక వైపు, ఉద్యోగుల ఆర్ధిక పరమైన సమ్యల పరిష్కారం ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఓవర్‌ డ్రాఫ్టుల మీద నడుస్తున్న ప్రభుత్వానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ.30,275 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అనుమతులు లభించాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్దిక శాఖతో పాటు రిజర్వు బ్యాంకు అధికారులకు వర్తమానం పంపారు. ఈఏడాది ఎన్నికల ఏడాది కావడంతో పాలనా పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సమయంగా మారింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

- Advertisement -

ఈ సమయంలో కొత్త ఆర్దిక సంవత్సరంలో ఆర్దికంగా తోడ్పాటు గురించి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్రం ఈప్రతిపాదనలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఈనిర్ణయం పెద్ద ఊరటను ఇవ్వనుంది. ఈ నెలలో ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి అరియర్స్‌ క్లియర్‌ చేయటంపైగతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వంపైఒత్తిడి పెరుగుతోంది. జీతాలు క్లియర్‌ అవుతున్నా.. ఇంకా పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్దికంగా ఉన్న ఒత్తిడి సమయంలో కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పించినట్లయింది.

వచ్చే వారం మరో రూ 3,500 కోట్లు..

223-24 ఆర్దిక సంవత్సరంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ 30,275 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏప్రిల్‌లో అడహక్‌ అనుమతులతో రూ.6 వేల కోట్ల రుణం ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఆర్దిక సంవత్సరంలో అంతా కలిపి రూ.24,275 కోట్ల రుణాలకు అనుమతి ఉందని తేల్చి చెప్పింది. ఈనెల 9వ తేదీనాటికి రూ.3,500 కోట్ల రుణాలు సమీకరణకు రిజర్వ్‌ బ్యాంకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. తాజా అనుమతులతో ఏ నెలలో ఎప్పుడు ఎంత రుణం కావాలో రాష్ట్ర అధికారులు ఇండికేటివ్‌ క్యాలెండర్‌ సిద్దం చేసి రిజర్వ్‌ బ్యాంకుకు పంపనున్నారు. ప్రస్తుతం రుణాలకు అనుమతి లభించటంతో ఓవర్‌ డ్రాప్ట్‌ వెసులుబాటు వినియోగించుకుంటున్నారు.

ఎన్నికల ఏడాదిలో కీలకంగా..

మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. పాలనా పరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలకు ఇది కీలక సమయం. ఆర్దికంగా ఎన్ని సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులతో పాటుగా ఇతరత్రా చెల్లింపుల ఒత్తిడి ప్రభుత్వంపై కొనసాగుతోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల భారం గత ఏడాది కంటే పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పాటుగా అప్పుల సమీకరణ ద్వారా వీటిని పూర్తి చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఎన్నికల వేళ క్షేత్ర స్థాయిలో మరిన్ని హామీల అమలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి కేంద్ర నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు- కలగనుంది. మే 10 నాటికి రూ 3,500 కోట్ల రుణం వస్తుండటంతో ఓవర్‌ డ్రాప్ట్‌ వినియోగానికి ఆలోచించాల్సిన పరిస్థితుల నుంచి బయట పడినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement