Monday, May 6, 2024

వాతావరణ విపత్తులతో రోజుకు 1600 కోట్లు నష్టం.. ప్రపంచ వాతావరణ సంస్థ తాజా నివేదిక

వాతావరణ విపత్తుల వల్ల రోజుకు 200 మిలియన్‌ డాలర్లు (రూ.1600కోట్లు) ఖర్చవుతోందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అనివార్యమైన వాతావరణ విపత్తు ముంచుకొస్తోందని, అయినా ప్రపంచ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తోందని హెచ్చరించింది. వాతావరణ మార్పులపై విజ్ఞాన శాస్త్రాన్ని కలిపే కొత్త నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ప్రపంచ వాతావరణ సంస్థ తాజా హెచ్చరికలో, వాతావరణ సంబంధిత విపత్తులు గత 50 సంవత్సరాలలో ఐదు రెట్లు పెరిగాయని తెలిపింది. సగటున రోజుకు 115 మంది మరణిస్తున్నారని, మున్ముందు ఇది మరింత తీవ్రమవుతుందని చెప్పింది.

ఐక్య‌రాజ్య స‌మితి సెక్రటరీ జ‌నరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ పాకిస్తాన్‌లో వరదలు, యూరప్‌లో వేడిగాలులు, చైనా, ఆఫ్రికా, యునైటెడ్‌ స్టేట్స్‌లో కరవులను ఉదహరించారు. శిలాజ ఇంధనాల వినియోగంపైనా ప్రస్తావించారు. పర్యావరణ విపత్తుల్లో శిలాజ ఇంధనాల పాత్ర గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తీవ్ర ముప్పు అని తెలిసినా ప్రతిఏటా శిలాజ ఇంధన ఉపయోగాన్ని రెట్టింపు చేస్తున్నాము. దీని పర్యవసానాలు ఊహకందని విధ్వంసానికి దారితీస్తాయి. పూర్వ కాలాలతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల రాబోయే ఐదేళ్లలో 1.5 డిగ్రీల సెల్సియస్‌ (2.7 ఫారెన్‌హీట్‌)కి చేరుకునే అవకాశం 48శాతం ఉందని ఐరాస అధ్యయనం పేర్కొంది.

వచ్చే ఐదేళ్లలో ఒకసారి రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యేందుకు 93శాతం అవకాశం ఉంది. 2015 ప్యారిస్‌ వాతావరణ ఒప్పందంలో నిర్ణయించబడిన ఉష్ణోగ్రత స్థాయిలను ఆమోదించినట్లయితే, నాలుగు వాతావరణ ”టిప్పింగ్‌ పాయింట్లు” ప్రేరేపించబడతాయని గతవారం శాస్త్రవేత్తల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఐరాస నివేదిక వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement