2022లో మరిన్ని కంపెనీలు యూనికార్న్ జాబితాలో చేరుతాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. ఏదైనా కంపెనీ మార్కెట్ విలువ ఒక బిలియన్ డాలర్లు చేరుకుంటే వాటిని యూనికార్న్గా పిలుస్తారు. భారత్లోని పలు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు వచ్చి చేరాయని తెలిపింది. గతేడాది 42 యూనికార్న్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఈ ఏడాది మరో 100కు పైగా కంపెనీలు యూనికార్న్ హోదా పొందుతాయని చెప్పుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా.. అత్యధిక యూనికార్న్ కంపెనీలు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నది. 2022 తొలి రెండు నెలల కాలంలో.. పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. దీంతో ప్రతీ ఐదు రోజులకోసారి ఒక యూనికార్న్ కంపెనీ అవతరించింది. శాస్త్ర సాంకేతికతను వ్యవస్థను ప్రతీ సంస్థ అందిపుచ్చుకుందని, దీంతో పెట్టుబడులు భారీగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది.
834 మిలియన్లకు ఇంటర్నెట్ యూజర్లు..
ఇంటర్నెట్ ఆధారిత, డిజిటల్ కార్యకలాపాలు భారీగా పెరిగినట్టు వివరించింది. కరోనా కారణంగా కూడా పెట్టుబడి సంస్థలు.. అంకురసంస్థల వైపు పరుగులు పెట్టాయని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగినట్టు వివరించింది. రోజురోజుకూ నెట్ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2021 నాటికి భారత్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 7 శాతం పెరిగి.. 834 మిలియన్లకు చేరుకుందని చెప్పుకొచ్చింది. టెలికాం కంపెనీల్లో నెలకొన్న పోటీ.. ఇంటర్నెట్ను మరింత చేరువ చేసింది. చాలా తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్లాన్లు ప్రకటించడం కూడా దీనికి మరోకారణంగా చెప్పుకోవచ్చు. కొనుగోళ్లు, చెల్లింపులు, విద్య, ఈ-కామర్స్ సహా ఇతర వ్యాపార రంగ కార్యకలాపాల్లో.. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకటించింది. దీనికితోడు స్థానిక భాషల్లో ప్రత్యేక యాప్లు వచ్చాయి. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లు, చెల్లింపులు భారీగా పెరిగాయి. ఫిన్టెక్, ఈ కామర్స్, ఎడ్టెక్ కంపెనీల్లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నట్టు నివేదిక ఈ సందర్భంగా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..