Monday, May 6, 2024

భూకంపాలకు నివారణ లేదా…

భూమిని మనం కాపాడితే అది మనల్ని కాపాడు తుంది. ధర్మాన్నిమనం రక్షిస్తే, ధర్మమే మనలను కాపాడుతుందన్న ఆర్యోక్తిని గుర్తు చేయగానే, అది పాత చింతకాయ పచ్చడని ఈసడింపుగా, హేళనగా మాట్లాడే వారు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడంలో విజయాన్ని సాధించిన మానవుడు వాటిని నివారించడంలో వెనుకబడి పోతున్నాడు. అంగారకునిపైఇళ్ళు కట్టుకోవడానికి తహతహలాడుతున్న శాస్త్రజ్ఞులు ముందుగా భూకంపాలను అరికట్టేందుకు పరిశోధనలు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు అనేవి సహజమైనవే కావచ్చు.. కానీ, వాటిలో మానవ కల్పిత మైనవి కూడాఉంటాయి. అఫ్గానిస్తాన్‌లోని ఖోస్త్‌ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపానికి వెయ్యి మందిపైగా మరణించారు. కొన్నివేల మంది గాయ పడ్డారు. అఫ్గానిస్తాన్‌ది కన్నీటి చరిత్ర.అక్కడి ప్రజలపై మతం పేరిట తాలిబన్లు ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నారు. పాకిస్తాన్‌లోనూ అదే పరిస్థితి. పాకిస్తాన్‌ కూడా భూకం పాల ప్రభావానికి లోనయ్యే ప్రాంతంలోనే ఉంది. అఫ్గానిస్తాన్‌, తజికిస్తాన్‌, పాకిస్తాన్‌, జమ్ము, కాశ్మీర్‌లు హిందూ కుష్‌ పర్వత ప్రాంతాల పరిధిలోకే వస్తాయి. హిందూ కుష్‌ ప్రాంతాల్లో తరచూ సంభవించే భూకంపాలను నివారించేందుకు ఈ ప్రాంతానికి చెందిన దేశాలు సమష్టి కార్యాచరణకు పూనుకోవాలి. హిమాలయ పర్వతాలకు పశ్చిమంగా 800 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న హిందూ కుష్‌ పర్వత ప్రాంతాన్ని అగ్నివలయంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో భూమిలోపల పలకాలు కదులుతున్నప్పుడు భూకంపాలు సంభవిస్తుంటాుం దేశంలోని పలు ప్రాంతాల్లో ఖనిజాల కోసం, ఇతర అమూల్య సంపద కోసం జరిపే తవ్వకాల ప్రభావం వల్ల కూడాభూకంపాలు సంభవిస్తూ ఉంటాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.

అఫ్గానిస్తాన్‌లోనే భూకంపాలు ఎందుకు ఎక్కువ సంభవిస్తున్నాయంటే ఈ ప్రాంతంలో భూమిలోపల పలకల కదలిక ఎక్కువగా ఉండటమే కారణం. అణు ధార్మిక కేంద్రాలు, ప్రాజెక్టులు భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతాల్లో నిర్మించవద్దని పర్యావరణ వేత్తలు చేస్తున్న హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. అణు ధార్మిక శక్తి ప్రభావం వల్ల కూడా వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉంది. మన దేశంలో భూకంపాలు తక్కువే కానీ, అఫ్గానిస్తాన్‌ ,పాకిస్తాన్‌ చిలీ తదితర ప్రాంతాల్లో తరచుగా వస్తూ ఉంటాయి. భూమిని కాపాడుకోవలసిన మనిషి అత్యాశకు పోయి అతిగా తవ్వకాలు జరపడం వల్ల భూకంప ప్రమాదాలు సంభవిస్తుంటాయి. నిన్న ( గురువారం) ఉదయం నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి ప్రకంపించినట్టు సమాచారం. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆటవిక పాలనకు తోడు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రజలకు కునుక లేకుండా చేస్తున్నాయి. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడాకొన్ని చోట్ల భూప్రకంపనలు తరచు సంభవిస్తూ ఉంటాయి. అర్థరాత్రి వేళ సంభవించే ఈ ప్రకంపనల భయంతో జనం నిద్రపోకుండా జాగరణ చేస్తుంటారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నట్టు తరచూ సమాచారం అందుతుంది. తవ్వకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలాఅవసరం. ఈ మధ్య గుప్తధనం ఉందనే వార్తలను పురస్కరించుకుని కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలను జరుపుతున్నారు. అలాగే, క్వారీలలో కంకర కోసం బ్లాస్టింగ్‌లు జరపడం వల్ల భూమి అదరడం సర్వసాధారణం. సమీపంలోని ఇళ్ళల్లో వస్తువులు పడిపోవడం, కుదుపులకు లోను కావడం గురించి కూడా వార్తలు వస్తుంటాయి. ప్రకృతి వైపరీత్యాల్లో చాలా మటుకు మానవ కారకమైనవేననడంలో అతిశయోక్తి లేదు. భూమిని కాపాడుకోవాలన్న స్పృహను జనంలో కలిగించడానికే ఏటా ధరిత్రి దినోత్సవాలను జరుపుతూ ఉంటారు. భూమిప్రకోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. భూతాపాన్ని అరికట్టేందుకు ఏటా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. అలాగే, భూకంపాలను నివారించేందుకు కూడా జరిగే సదస్సులు కేవలం తీర్మానాలను ఆమోదించడం వరకే సరిపెడుతున్నారు. భూకంపాల నివారణపై అన్ని స్థాయి ల్లో అధ్యయనాలు జరగాలి. తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement