Tuesday, May 14, 2024

గోదాదేవి భక్తి పారవశ్యం

నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్థం స్వం శృతిశత శిరస్సిద్ధం అధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా
బలాత్కృత్యభుంక్తే గోదా తస్యై నమ
ఇదమిదం భూయయేవాస్తుభూయ:
స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బందుర జిష్ణవే
విష్ణుచిత్త తనూజాయ్నై గోదాయై నిత్యమంగళం


భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలూ ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి, ఆండాళ్‌ గోదాదేవి. తులసి వనంలో జన్మించి, భట్టనాథ ఆళ్వార్‌కి పెంపుడు బిడ్డయై వటపత్ర శాయి భక్తురాలై.. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని, తాను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకొన్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి, అల నాటి గోపికల కాత్యాయినీ వ్రతంలాగా, తానూ ప్రధాన గోపికగా ఊహించుకొని, తన స్నేహితు రాండ్లని గోపికలుగా తీర్చిదిద్ది, అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా, శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు, జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఆమె 30 పాశురాలు రాసి, పాడి మన కోరికలు తీరడానికి ‘తిరుప్పావై’ పేరిట భక్తులకు ధారపోసింది. ధనుర్మాసం.. భక్తపారవశ్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతంచేసి, నారాయణుని కీర్తించి కృష్ణమందిరంచేరి, కృష్ణ కుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం విన్నవించుకుంటుంది.
తమని ఎలా కటాక్షించాలో కూడా భక్తవివశయై సూచిస్తుంది. సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చి సభలోకి తమని ఆహ్వానించాలనీ, తమ గురించి స్వయంగా అడిగి తెలు సుకోవాలని.. అప్పుడు తమ కోరికలేమిటో కృష్ణుడికి విన్నవించుకోవాలనీ, ద్వారపాలకుల ద్వారా తెలియపరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువు తీరి కుశల ప్రశ్నలు వేసి ‘మీ కోరికలేమిట’ అని అడుగుతాడు. దానికి గోదాదేవి.. ‘కల్యాణ గోవిందా! మీరు ఈ ఆడపిల్లలందరికి సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు, గాజులు, భుజకీర్తులు కర్ణాభరణాలైన చెవిదిద్దులు, పాదా భరణాలు, మాకు సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మా కు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవ#హంచేట్టుగా నెయ్యి ఉండాలి. ఇంతేకాదు గోవిందా! నీవు మాలో ఒకడిగా భుజించాలి. నీకు, మాకు ఉన్న సంబంధం విడదీయ రానిది. మనం అంతా గొల్లవారమే. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకో వద్దు. నీ పాదాలని మేము స్పృశించి, కడగడానికి మీరు సహకరించాలి’. అంటూ గోదాదేవి భగవ త్‌ సాన్నిధ్యాన్ని, అనుభవించి అకార త్రయములైన జ్ఞానభక్త ప్రపత్తులను అనన్య గతిత్వమును, భక్తవశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది.
– రావుల రాజేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement