Wednesday, May 15, 2024

దేహమే దేవాలయం… జీవుడే దేవుడు

జీవిలోనే దేవుడు ఉంటాడని, జీవుడు- దేవుడు కలిసి ఉన్న ప్పుడే మానవ జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని ముండకోపనిషత్తు తెలియజేసింది. శరీరం ఒక దేవాలయంగా భావించినప్పుడు ఆ దేవాలయంలో ఉండే దేవుడు జీవుడు. అందు కే దేవుణ్ని జీవాత్మ, భగవంతుణ్ని పరమాత్మ అని తత్వవేత్తలు సంబోధిస్తుంటారు. భక్త కవులు తమ కవిత్వాల్లో జీవుణ్ని పరమా త్మ అంశగా అభివర్ణిస్తుంటారు. గోస్వామి తులసీదాసు అదే అభిప్రా యంతో సులభ శైలిలో ఈ పద్యం చెబుతాడు.
ఈశ్వర్‌ అంశ్‌ జీవ్‌ అవినాసీ
చేతన్‌ అమల్‌ సహజ్‌ సుఖ్‌ రాసీ
సో మాయాబస్‌ భయవ్‌ గోసాయీ
బంధ్యో కీర్‌ మరకట్‌ కీ నాయీ
భగవంతుని అంశ అయిన జీవుడు, చైతన్యవంతుడు… నిర్మ లుడు… సుఖసంపన్నుడు… అమరుడు. మాయలో చిక్కుకున్న ఆ జీవుడు చిలుక, వానరం (కోతి) వలె తనను తాను బందీగా చేసు కుంటాడు. ఆ బంధంలో పడిన జీవుడు అదే పరమ సుఖంగా భావించి అందులోనే ఉండిపోతాడు. శారీరక ఇంద్రియాలకు బాని సగా మారిన మనిషి తనలోని పరమాత్మను తెలుసుకోలేడు అం టాడు కవి. జీవాత్మలోనే పరమాత్మ ఉంటాడని తెలుసుకోలేని వారు భగవంతుని కోసం బయట వెదుకుతుంటారు అంటాడు కబీరుదాసు. కస్తూరి మృగం స్వభావాన్ని ఉదహరిస్తూ కస్తూరి మృగం సుగంధ భరితమైన కస్తూరిని విడుదల చేస్తుంది కానీ ఆ పరిమళం తనలోనుండే వస్తుందని గుర్తించలేక తన ముక్కు పుటా లను మీటే సుగంధం కోసం అడివంతా గాలిస్తుంటుంది.
దేవాలయం అనే శరీరంలో ఉండే జీవుడే దేవుడు. అంతేగాని జీవుడూ దేవుడు వేరుకాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చిన జగద్గురు ఆదిశంకరాచార్యులు ”మానవుడు తన స్వరూపాన్ని మాత్రమే గుర్తిస్తాడు కానీ శరీరంలోని నిజ స్వరూపమైన సృస్వ రూపాన్ని కనుగొనలేడు” అంటూ ఓ చక్కని ఉదాహరణ చూపు తాడు. ”ఒక సింహంపిల్ల తప్పిపోయి గొల్లవానికి దొరుకుతుంది. అతడు దానిని తన గొఱ్ఱల మందతోపాటు పెంచగా, కొంచెం పెద్ద దవుతుంది. గొఱ్ఱలతో తాను ఒక గొఱ్ఱను అనుకొనేది. అలాగే ప్రవ ర్తించేది కూడా! ఒకసారి గొఱ్ఱలన్నీ అడవిలో మేస్తుండగా నట్టడవి నుంచి సింహం వచ్చి ఆ మందపై పడుతుంది. గొఱ్ఱలన్నీ పారి పోతాయి. గొఱ్ఱవలె పెరుగుతున్న ఆ సింహపు పిల్ల కూడా వాటితో పాటు పారిపోతుంది. అడవి సింహం చూసి ఆశ్చర్యపడి పరిగెత్తే సింహపు పిల్లను ఆపగా అది ”చిన్న గొఱ్ఱను నన్ను చంపకయ్యా” అంటూ వణుకుతూ బ్రతిమలాడుతుంది. అడివి సింహం నవ్వు తూ దాన్ని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తన ప్రతిబింబాన్ని చూపుతుంది. పిల్ల సింహం, అడివి సింహం వలె తన మూతిపై ఉన్న మీసాలను చూస్తుంది నీటిలోని ప్రతిబింబంలో. అప్పుడు గాని ఆ సింహపు పిల్లకు తాను గొఱ్ఱను కానని అర్థంకాదు. అప్పుడు ఎదుట ఉన్న సింహం వలె గర్జించడం మొదలుపెడుతుంది. ఇక్కడ పిల్ల సింహానికి కొత్తగా వచ్చింది స్వస్వరూప జ్ఞానమే కానీ స్వరూ పం (శరీరం) కాదు. అంటే ఆ పిల్ల సింహానికి నిజంగా తానెవరో తెలుస్తుంది. మానవులందరూ ఆత్మస్వరూపులనే జ్ఞానాన్ని తెలుసు కోలేకపోతున్నారు. తాము వేరు, భగవంతుడు వేరు అనే భావనతో ప్రవర్తిస్తున్నారని ఆదిశంకరుల అభిప్రాయం.
రమణ మహర్షి కూడా ”నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీలో ని అంతరాత్మను చూడగలవు. ఆ అంతరాత్మలోని పరమాత్మున్ని కనుగొనగలవు” అంటాడు. భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ”భగ వంతుడు సర్వాంతర్యామి. అంతటా అన్నింటిలో, అందరిలో కొలు వై ఉంటాడని తెలుసుకోలేని అజ్ఞానులు అహంకారంతో మదాం ధులై విర్రవీగుతున్నప్పుడు సర్వాంతర్యామి ఏదో రూపంలో వచ్చి వారిని సంహరిస్తాడు” అని హిరణ్యకశిపుని ద్వారా తేటతెల్లం చేస్తుంది. హిరణ్యకశిపుడు తాను వేరు, భగవంతుడు వేరు అను కొని అహంకారంతో విర్రవీగుతూ కొడుకని చూడకుండా ప్రహ్లాదు న్ని అనేక హింసలకు గురిచేస్తుంటాడు. అంతేగాక ”ఎక్కడరా, నీ నారాయణుడు’ అంటూ హేళన చేస్తుంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ”ఇందుగలడందులేడని సందేహంవలదు… ఎందెందు వెదికి చూసిన అందందే గలడు…” అంటూ ఆ దురహంకారికి నర్సింహు డిచే తగిన శాస్తి చేయిస్తాడు.
భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు అర్జునికి భగవాణుడు ఎక్కడుంటాడో చెబుతూ ”పార్థా, అన్ని జీవుల హృద యాల్లో ఈశ్వరుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. సకల జీవులను మాయ అనే యంత్రాన్ని ఎక్కించి కిందికి మీదికి తిప్పుతుంటాడు. ఆ మాయ నుంచి రక్షింపబడాలంటే నువ్వు అహంకార మమ కారాలు వీడి పరమాత్ముణ్ని నిండు మనస్సుతో ధ్యానించు, ప్రేమ, సహృదయత, ఆత్మ సమర్పణాభావం, పరోపకార సంసిద్ధత ఉన్నచోట భగవాణుడు కొలువై ఉంటాడు” అంటా డు. దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, నిరంజ నుడు, సత్యశుద్ధ స్వరూపుడు కాబట్టి అన్ని రూపాల్లోనూ, అన్ని సుగుణాల్లోనూ ఆయనే ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి దైవీ గుణాలు కలిగుండాలి.
మానవుడు దేవుడు కావాలి అంటే ప్రతి ఒక్కరు మానవత్వం లో దైవత్వాన్ని చూడాలి. అసూయ ద్వేషాలు లేకుండా ప్రేమ, దయ కలిగుండాలి. నలుగురికి చేతనైనంత సాయం చేస్తూ తోడ్పడాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తనారీతులు వ్యక్తుల్లో అలవడుతాయో ప్రతి మనిషి దేహం దేవాలయమై అందులో ఉండే జీవుడు దేవుడవుతాడు.
– పరికి పండ్ల సారంగపాణి
98496 30290

Advertisement

తాజా వార్తలు

Advertisement