Friday, April 26, 2024

తెలంగాణాకు మరో పర్యాటక తలమానికం కానున్న ముచ్చింతల్ : సీఎస్. సోమేశ్ కుమార్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీ రామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. రేపు శనివారం ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను డీజీపి మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి నేడు పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకంలో చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ ఆలయం హైదరాబాద్ కు ఒక వైపు అద్భుత దర్శనీయ క్షేత్రంగా మారనుండగా, మరో వైపు 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత క్షేత్రంగా మారనుందని ఆకాక్షించారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ప్రపంచంలోని వైష్ణవ ఆరాధకులకు ప్రధాన క్షేత్రంగా మారుతుందని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల 14వ తేదీ వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసిందని అన్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గురువారం నాడు పరిశీలించారని, సి.ఎం ఆదేశాల మేరకు తిరిగి ఈ రోజు ఏర్పాట్లను సమీక్షించడానికి డీజీపి, ఇతర సీనియర్ అధికారులతో వచ్చామని పేర్కొన్నారు. డీజీపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానితోపాటు ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈనెల 14 తేదీ వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టిందని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, కేవలం ప్రత్యేక పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకై దాదాపు 8 వేలకు పైగా పోలీసు అధికారులచే బందోబస్తును ఏర్పాటు చేశామని వెల్లడించారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించడం జరుగుతుందని, మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలలో మూడవ రోజైన శుక్రవారం నాడు నిర్వహించిన అష్టాక్షరీ మంత్ర జపం, పూర్ణాహుతి అనంతరం శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి, సి.ఎస్. సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డిలతోపాటు ఇతర అధికారులకు ప్రసాదాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement