Wednesday, May 8, 2024

బ్రో మూవీ నవ్విస్తుంది, బాధపెడుతుంది. చూసి నవ్వుతూ ఏడుస్తాం – ప‌వ‌న్ క‌ల్యాణ్

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ‌త రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఇంత అభిమానం, ఇంత ప్రేమ నాకు సినిమానే ఇచ్చింది. ఒక్కోసారి ఇంత అభిమానం, ప్రేమ కలా నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం. ఏరోజు కూడా చాలా చిన్న జీవితాన్ని బ్రతకాలి అనుకున్నాను తప్ప, ఒక నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. మీ పట్ల నాకున్న అభిమానం, ప్రేమ నేను మాటల్లో వర్ణించలేను. మీ ప్రేమ, అభిమానం నాలో అణువణువునా ఉంటాయి. సముద్రఖని గారు చెప్పినట్లుగా, ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది చాలా సంపూర్ణమైన సినిమా. కరోనా సమయంలో ఒకసారి ప్రముఖ దర్శకులు, మిత్రులు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు. సముద్రఖని గారి దగ్గర ఓ కథ విన్నాను, చాలా బాగుందని చెప్పారు. నాకు ఒకసారి కథ నచ్చిందంటే రచయితని గానీ, దర్శకుడిని గానీ సంపూర్ణంగా నమ్మేస్తాను. అంత నమ్మకంగా ఈ సినిమా చేశాను. సముద్రఖని గారు రాసిన కథకి త్రివిక్రమ్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన స్క్రీన్ ప్లే చాలా బాగా డెవలప్ చేశారు.


ఒక విషయంలో నేను సముద్రఖని గారికి అభిమానిని అయ్యాను. మనలో చాలామందికి తెలుగుభాష సరిగా చదవడం, పలకటం రాదు. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మన మాతృభాష బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటాను. అలాంటిది సముద్రఖని గారు మన భాష కాదు, మన యాస కాదు. మొదటిరోజు నేను స్క్రిప్ట్ రీడింగ్ కి వెళ్తే, అక్కడ ఆయన స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. ఆయన తమిళ్ లోనో, ఇంగ్లీష్ లోనో రాసుకొని చదువుకుంటున్నారు అనుకున్నాను. వెళ్లి చూస్తే అది తెలుగు స్క్రిప్ట్. మీకు తెలుగు వచ్చా అని అడిగితే, ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పారు. ఆయన మన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఆయనకు మాట ఇస్తున్నాను. నేను తమిళ్ నేర్చుకొని, ఒకరోజు తమిళ్ లో స్పీచ్ ఇస్తాను. సముద్రఖని గారు ఇంత తెలుగు నేర్చుకుంటే, తెలుగు మాతృభాషగా ఉన్న మనం ఇంకెంత తెలుగు నేర్చుకోవాలి అని కనువిప్పు కలిగేలా చేశారు. గొప్ప రచయితలు, దర్శకులు కావాలంటే మాతృభాష మీద పట్టుండాలి. మాతృభాష మీద, మన సాహిత్యం మీద పట్టుంటే గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఇది నేను కనీసం 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. సినిమా అంటే ఇష్టం నాకు, కానీ సమాజం అంటే బాధ్యత. సినిమా అంటే ప్రేమ నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారిలా, రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. ప్రభాస్ గారిలా, రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. మా కుటుంబానికి కూడా చెందినది కాదు.. ఇది అందరిదీ. ఈ కోట్లాదిమందిలో ఎవరైనా సరే బలంగా అనుకుంటే ఇక్కడ రాణించగలరు. చిరంజీవి గారు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. అప్పుడు మా వెనక ఎవరు లేరు. చిరంజీవి గారు హీరో అవుతావా అని అడిగినప్పుడు నాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదు.

నా ఊహ అంతా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకోవాలి. అంతకుమించి కోరికలు లేవు. కానీ నాకు సాహిత్యం, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టముండేది. దానివల్ల ఎటూ తేల్చుకోలేకపోయాను. అప్పుడు మా వదిన గారు నాకు మార్గనిర్దేశం చేశారు. అలా మనల్ని నమ్మి, ఏంకాదు చేయమని ప్రోత్సహించేవాళ్ళు కావాలి. నేను సుస్వాగతంలోని ఒక సాంగ్ షూటింగ్ కోసం అప్పుడు వైజాగ్ వెళ్ళాను. అక్కడ బస్సు పైన డ్యాన్స్ వేయమన్నారు. ఆరోజు నాకు ఏడుపొచ్చేసింది. పదిమంది ముందు నటించాలంటే, డ్యాన్స్ చేయాలంటే నాకు సిగ్గు. అప్పుడు మా వదినకి ఫోన్ చేసి చెప్పాను. నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెప్పకపోతే ఎక్కడో మారుమూల ప్రశాంతంగా ఉండేవాడిని కదా అన్నాను. ఆరోజు మా వదిన చేసిన పనే ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు. నేను ఆయన తమ్ముడిగా వచ్చాను. నేను ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోను. ఆయన పది కష్టపడితే, నేను దానికి మించి కష్టపడాలని నిర్ణయించుకున్నాను. పైకి సున్నితంగా కనిపిస్తాను కానీ నేను మొరటు మనిషిని. నాలోపల ఒక రైతు ఉంటాడు. నాకు తెలిసిందల్లా త్రికరణశుద్ధిగా పనిచేయడం. అదే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొనేలా చేసింది. సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. కష్టపడి పనిచేద్దాం. గొడ్డుచాకిరి చేస్తాం మేము. దెబ్బలు తగిలించుకుంటాం, కడుపులు మాడ్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. సినిమాల ద్వారా అందరినీ ఆనందింపజేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు, మీరందరూ ఏది అనుకుంటే అది ఎందుకు సాధించలేరు. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. నేను, త్రివిక్రమ్ గారు ఎక్కువగా సాహిత్యం, సైన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అంత చదువుకొని సినిమా మీద మక్కువతో ఇక్కడికి వచ్చి అద్భుతమైన రచయితగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. నీ స్నేహితుడిని చూపించు, నువ్వు ఏంటో చెప్తాం అంటారు. నాకు త్రివిక్రమ్ గారు స్నేహితుడు అయినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. ఆయను గురువు స్థానంలో పెడతాను. ఎందుకంటే ఆయన నుంచి పురాణాలు, సాహిత్యం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. మహా పండితుడు ఆయన. తెలుగు భాష మీద మక్కువ కలగడానికి త్రివిక్రమ్ గారి వంటివారు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సాహిత్య విలువలున్న యువ రచయితలు సినీ పరిశ్రమకి రావాలి. రాజమౌళి గారు మన పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారితో ఆయన చేసే సినిమా మన స్థాయిని మరింత పెంచాలి. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలి. నాకు అందరూ హీరోలు ఇష్టం. వారివల్ల ఎందరో కడుపు నిండుతుంది.

- Advertisement -

అందరూ బాగుండాలని కోరుకుంటూనే, మన పెద్ద హిట్ కొట్టాలని కసిగా పనిచేయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. నేను ఈ సినిమా 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగాను అంటే దానికి కారణం దర్శకుడు సముద్రఖని, డీఓపీ సుజిత్ వాసుదేవ్. థమన్ తో ఇది నాకు హ్యాట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ నటుడు కావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, నా బాధ్యతగా యాక్టింగ్ స్కూల్ లో చేర్పించాను అంతే. తన కష్టం మీద ఇక్కడివరకు వచ్చాడు. సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాను. తను స్పృహలో లేడు. ఈరోజు తేజ్ ఇక్కడ నిలబడి మళ్ళీ సినిమా చేయగలిగాడు అంటే ఆరోజు కాపాడిన అబ్దుల్ అనే కుర్రాడు కారణం. ఆస్పత్రిలో సాయి తేజ్ ని చూసి ఏం చేయలేని పరిస్థితిలో కాపాడమని దేవుడిని కోరుకున్నాను. తేజ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా సాయి తేజ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారే సూచించారు. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందే సెట్లు రెడీ చేసి పెట్టుకొని, సరైన ప్రణాళిక చేసిన నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం. ఇలాంటి చక్కటి సినిమాని అందించిన సముద్రఖని గారికి కృతఙ్ఞతలు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడే ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతాం” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement