Thursday, May 2, 2024

ఓటీటీ రిలీజ్ కు రెడీగా అక్షయ్ కుమార్ రక్షా బంధన్.. ద‌స‌రా నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఆనంద్ ఎల్ ర‌య్ ద‌ర్శ‌క‌త్వంలో.. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన సినిమా ర‌క్షా బంధ‌న్. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆగ‌స్ట్ 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో న‌లుగురు చెల్లెళ్ల‌కు అన్న‌గా అక్ష‌య్ కుమార్ న‌టించాడు. చెల్లెళ్ల‌కు పెళ్లిళ్లు చేసిన త‌ర్వాతే తాను పెళ్లి చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చిన మాటను నిల‌బెట్టుకునే క్ర‌మంలో అక్ష‌య్‌కుమార్‌కు ఎదుర‌య్యే ప‌రిణామాల‌తో వినోదాత్మ‌కంగా ఈ సినిమా రూపొందింది. మూవీలో అక్ష‌య్ న‌ట‌న బాగున్నా అవుట్ డేటెడ్‌ కామెడీ కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని అంత‌గా మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు వంద కోట్ల వ్యయంతో రూపొందిన ర‌క్షా బంధ‌న్‌ యాభై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

కాగా, ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ వెల్ల‌డించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5 నుంచి జీ5లో ర‌క్షా బంధ‌న్ స్ట్రీమింగ్ కానుంది. దాదాపు 30 కోట్ల భారీ ధ‌ర‌కు ర‌క్షాబంధ‌న్ డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ర‌క్షా బంధ‌న్ సినిమాలో భూమి ఫ‌డ్నేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. సాదియా ఖ‌తీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, దీపికా ఖ‌న్నా, షాహెజ్ మీన్ కౌర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement