దేశంలో 5జీ సర్వీస్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా దశలవారిగా దేశమంతా ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. ఢిల్లిలోని ప్రగతి మైదాన్లో శనివారం నాడు జరగనున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 6వ సదస్సులో ప్రధాని ఈ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
5జీ టెక్నాలజీ వల్ల హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4జీ కంటే 10 రేట్లు అధిక వేగంతో నెట్ వస్తుంది. పూర్తి సినిమా, వీడియోలను కొన్ని సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 5జీ స్పెక్ట్రమ్ను దక్కించుకున్నాయి. అక్టోబర్లోనే 5జీ సేవలు తమ కస్టమర్లకు అందిస్తామని ఇప్పటికే జియో, ఎయిర్టెల్ ప్రకటించాయి. ముందుగా ఏ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేది ఆయా టెలికం సంస్థలు ప్రకటించనున్నాయి.