Saturday, May 4, 2024

భారీగా విస్తరించనున్న సిట్రాన్‌ ఈవీ.. నెట్‌వర్క్ పెంచుకోవడంపై దృష్టి

సిట్రాన్‌ ఇండియా ఈవీ కార్ల మార్కెట్‌లో భారీగా విస్తరించాలని భావిస్తోంది. ఈ మార్కెట్లో మూడో స్థానానికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెంచ్‌ కార్ల తయారీ కంపెనీ అయిన సిట్రాన్‌ సంప్రదాయ కార్ల మార్కెట్‌లో ప్రవేశించినప్పటికీ ఇప్పటి చెప్పుకోదగిన మార్కెట్‌ వాటాను సాధించలేకపోయింది. దేశంలో ఈవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సెగ్మెంట్‌లో భారీగా విస్తరించడం ద్వారా బలపడాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈసీ3 పేరుతో విద్యుత్‌ కారును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కారును కంపెనీ పూర్తిగా దేశీయంగానే తయారు చేసింది. మార్కెట్‌లోకి వచ్చిన ఆరు నెలల్లో కంపెనీ 3,000 యూనిట్లను విక్రయించింది. దేశీయ ఈవీ కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం తాము మూడో అతి పెద్ద కంపెనీగా ఉన్నామని తెలిపింది. టాటా మోటార్స్‌, ఎంజీ ఇండియా తరువాత సిట్రాన్‌ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

వచ్చే ఆరు నెలలకు డెలివరీలకు వాహనాలు బుక్‌ అయ్యాయని కంపెనీ ఇండియా హెడ్‌ సౌరభ్‌ వత్స తెలిపారు. ఈ కారు ప్రారంభ ధరను కంపెనీ 11.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది.ఈ కారు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 320 కి.మీ సర్టిఫైయిడ్‌ రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. రియల్‌ రేంజ్‌ 240 కి.మీ వస్తుందని పేర్కొంది. కంపెనీ బీ2బీ బిజినెస్‌పై కేంద్రీకరించనున్నట్లు సౌరభ్‌ తెలిపారు.

ప్రస్తుతం కంపెనీ ఢిల్లి, ముంబై, బెంగళూర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 44 కేంద్రాల్లో వీటిని విక్రయిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 75కి పెంచడం ద్వారా అన్ని ముఖ్యమైన నగరాలకు నెట్‌వర్క్‌ను విస్తరించి అమ్మకాలు పెంచుకోవాలన కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

గత సంవత్సరం సెప్టెంబర్‌లో టాటా కంపెనీ టియాగో ఈవీని 8.69 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) ధరలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. జనవరి నుంచి కస్టమర్లకు డెలివరీలు ఇస్తోంది. ఇప్పటి వరకు 19,000 యూనిట్లను టాటా కంపెనీ విక్రయించింది. టాటా కంపెనీ టిగోర్‌ను 12.49 లక్షలధరలో విడుదల చేసింది. ఈ రెండు కార్లకు పోటీగా సిట్రాన్‌ ఈ-సీ3ని కంపెనీ విడుదల చేసింది. త్వరలోనే కంపెనీ సీ3 ఎస్‌యూవీ విద్యుత్‌ కారును మార్కెట్‌లోకి తీసుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement