Tuesday, May 7, 2024

Bengaluru: బెంగళూరులో నరకయాతన.. అండర్​పాస్​లో చిక్కుకున్న కారు, విజయవాడ మహిళ మృతి

కర్నాటకలో భారీ వర్షం కురిసింది.. బెంగళూరును చూడ్డానికి వెళ్లిన ఏపీలోని విజయవాడకు చెందిన కుటుంబం కేఆర్​ సర్కిల్​ వద్ద ఉన్న అండర్​పాస్​ నీటిలో చిక్కుకుపోయింది. ఆ నీటి నుంచి బయటపడేదారిలేక, అంతకంతకూ పెరుగుతున్న నీటి ముంపులోనే వారు అరుపులు, కేకలతో విలవిల్లాడారు. అయితే.. విజయవాడ మహిళను కాపాడే యత్నంలో హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటకలో అకాల వర్షం దంచికొట్టింది. వడగండ్లు, ఈదురుగాలుతతో కూడిన వర్షంతో రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షంతో రోడ్లన్నీ నీటమునిగాయి. అయితే.. కర్నాటకలోని విధానసౌధకు కూతవేటు దూరంలో ఉన్న కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు నీటిలో చిక్కుకుంది. దీంతో విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ నీటిలో మునిగిపోయిన ఘటన ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరిగింది. నగరం నడిబొడ్డున వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఆ కారులో జర్నీ చేస్తున్న కుటుంబంలోని మరో ఐదుగురిని, డ్రైవర్‌ను రక్షించారు.

బాధితురాలితో పాటు ఇతరులను సెయింట్ మార్తాస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వారిలో భానురేఖ అనే మహిళ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల బంధువులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం, ఆసుపత్రిలో చేరిన వారికి ఉచిత వైద్యం అందజేస్తామని ఆయన ప్రకటించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ కుటుంబం కారు అద్దెకు తీసుకుని బెంగళూరు చూసేందుకు వచ్చింది. భానురేఖ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. కుండపోత వర్షం కారణంగా.. అండర్‌పాస్ వద్ద ఉన్న బారికేడ్ కిందపడిపోయింది. దీంతో డ్రైవర్ అండర్‌పాస్‌ను దాటడానికి ట్రై చేసినా సాధ్యం కాలేదు అని సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. సజీవంగా ఉన్న భానురేఖను ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారని ఘటనను కవర్ చేస్తున్న విలేకరులు ఫిర్యాదు చేయగా.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ నీటిని దాటడానికి ప్రయత్నించాడు. అయితే అండర్‌పాస్ మధ్యలో కారు దాదాపు మునిగిపోయింది. వాహనంలో ఉన్నవారు ప్రాణాలతో బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. కుండపోత వర్షం, వడగళ్ల వాన కారణంగా నీటి మట్టం అంతకంతకూ పెరిగింది. సహాయం కోసం వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల రక్షించేందుకు ముందుకు వచ్చారు. వారిని కాపాడే యత్నంలో చీరలు, తాళ్లు విసిరారు. వాటిని దొరకబుచ్చుకన్న వారు ఆ నీటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిలో ఇద్దరిని అత్యవసర సేవల సిబ్బంది, ఈతగాళ్లు బయటకు తీసుకొచ్చారు. మరికొందరిని నిచ్చెన సాయంతో నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ భానురేఖ చనిపోయింది. ప్రాణాలతో బయటపడిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాన్ని చూసి ఆసుపత్రి వద్ద పెద్దపెట్టున రోదనలు మిన్నంటాయి. కేఆర్‌సర్కిల్‌ వద్ద ఓ ఆటోరిక్షా కూడా ఇరుక్కుపోగా, వాహనంపైకి ఎక్కి ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలను కాపాడుకుంది.  ఇంతలో నగరం మధ్యలో ఉన్న మెజెస్టిక్‌కు సమీపంలో ఉన్న మరో నీటి అడుగున అండర్‌పాస్ వద్ద అనేక వాహనాలు చిక్కుకున్నాయి. ప్రజలు వాహనాల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరద ముంపునకు గురవుతున్నదని, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చాలామంది వాహనదారులు వాపోతున్నారు. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని ప్రధాన ప్రాంతమైన మహాలక్ష్మి లేఅవుట్ వద్ద ఇళ్లలోకి నీరు చేరి ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు దెబ్బతిన్నాయి.

మల్లేశ్వరం, రాజాజీ నగర్‌తో పాటు శ్రీరాంపురం, కెంగేరిలోని కొన్ని ప్రాంతాలు, మైసూరు రోడ్డు, అనేక ఇతర లోతట్టు ప్రాంతాలతో సహా అనేక ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. బెంగళూరు నలుమూలల నుండి నీటి ముంపు, చెట్లు కూలిపోతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని బెంగళూరు పౌర సంస్థ అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement