Tuesday, May 7, 2024

AP: ప్రజలకు సంక్షేమం.. ఉద్యోగులకు భరోసాగా ప్రభుత్వ పాలన… జగన్

ప్రజలకు సంక్షేమం.. ఉద్యోగులకు భరోసాగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ విజయవాడలో సోమవారం నిర్వహించిన 21వ రాష్ట్ర మహాసభలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటోందని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే 1.35 లక్షల నూతన ఉద్యోగాల భర్తీతో పనిభారం తగ్గించామని వివరించారు. టీడీపీ ప్రభుత్వం కనీసం ఊహించని ఆర్టీసీని తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే జీతాలు పెంచగా.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఉద్యోగులకు పెంచిన జీతాలు చెల్లిస్తోందని వివరించారు. ఉద్యోగుల జీతాల ఖర్చు గతంలో రూ. 1,100 కోట్లు ఉండగా.. నేడు రూ. 3,300 కోట్లకు చేరిందని, అయినా ఉద్యోగుల కోసం చిరునవ్వుతో భరిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, గ్రామ స్వరాజ్య సాధనలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని తమ ప్రభుత్వ సక్సెస్ కు కారణం ఉద్యోగులే అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

ప్రభుత్వం మీద అసాధ్యమైన బరువు పడకుండా, ప్రభుత్వాలు భారం ఎక్కువై భవిష్యత్తులో చేతులు ఎత్తేసే పరిస్థితి రాకుండా, అదే సమయంలో ఉద్యోగులు రిటైర్డ్‌మెంట్‌ అయిన తరువాత చిరునవ్వుతో బతికేలా, వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్‌కు కూడా పంపించామని సీఎం జగన్ తెలిపారు. ఈ పెన్షన్‌ స్కీమ్‌ రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల మీద, ఉద్యోగుల మీద ఎవరి మీదా గత పాలకులు ప్రేమ లేదని, వీరు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే వీరిమాటల్ని, కట్టు కథల్ని నమ్మవద్దని సీఎం కోరారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారని, 47మంది పోలీసులపై పుంగనూరులో దాడి చేశారని గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని సీఎం ఉద్ఘాటించారు. 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, 2022 జూలై 1కి సంబంధించిన డీఏ దసరా పండుగ నాడు అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తానని సీఎం హామి ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement