Sunday, April 28, 2024

AP | సెప్టెంబర్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యం అందిస్తాం: మంత్రి కారుమూరి

అమరావతి, ఆంధ్రప్రభ: సెప్టెంబర్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అన్ని జిల్లాల్లో పీడీఎస్‌, ఎండీఎం, ఐసీడీఎస్‌ ల ద్వారా పంపిణీ చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఐరన్‌, పోలిక్‌ ఆవ్లుం, బి12 ఉంటాయని, వీటి వలన ఐరన్‌ రక్తహీనతను నిరోధిస్తుందని, ఫోలిక్‌ ఆవ్లుం రక్తం ఏర్పడటానికి సహయపడుతుందని, బి12 విటమిన్‌ తో నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో కలపటం వల్లన పోషక బియ్యం తయారవుతుందన్నారు.

ఈ బియ్యం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో శరీరానికి పోషకాలు అందటమే కాకుండ విటమిన్స్‌ అందుతాయని తెలిపారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంపై కొంత మంది కావాలని ప్రభుత్వం ప్లాస్టిక్‌ బియ్యం సరఫరా చేస్తున్నదని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహోన్నత ఆశయంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం చేకూర్చటానికి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఫైలట్‌ ప్రాజెక్ట్‌ గా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్‌, ఎండీఎం, ఐసీడీఎస్‌ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేశంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ నెల నుంచి ఐసీడీఎస్‌ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 3 కేజీల పోషక బియ్యం ప్యాకెట్లను ఇంటికే రేషన్‌ పథకం కింద పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అపోహలొద్ద ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన పెంచటానికి ప్రభుత్వం ఇప్పటికే పోస్టర్లు తయారు చెెశామని,. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధుతో విడియో కూడా రూపొందించి ప్రచారం నిర్వహించనున్నామని చెప్పారు. విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో పాటు- రేషన్‌ దుకాణాల్లో ఫోర్టిఫైడ్‌ కెర్నల్స్‌ కలిపిన గోదుమపిండి కూడా అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు కూడా పిలవనున్నట్లు తెలిపారు.

బలవర్ధకమైన ఫోర్టిఫైడ్‌ బియ్యం ప్రతి ఒక్కరూ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం ప్లాస్టిక్‌ బియ్యం అనే అనుమానాలు తీరాలంటే మెడికల్‌ షాపుల్లో దొరికే అయోడిన్‌ ను తెచ్చి ఫోర్టిఫైడ్‌ బియ్యంపై వేస్తే నీలం రంగులోకి మారతాయని వివరించారు. ప్లాస్టిక్‌ అయితే రంగు మారవు అన్నారు. అలాగే నీళ్లలో నానబెట్టినప్పడు ఫోర్టిఫైడ్‌ బియ్యం త్వరగా మెత్తబడతాయని, ప్లాస్టిక్‌ మెత్తబడదన్నారు. ఈ విషయాన్ని పాత్రికేయుల సమావేశంలో ప్రయోగాత్మకంగా మంత్రి చేసి చూపించారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంను పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు- మన రాష్ట్రంలోనూ తయారు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

- Advertisement -

రాగులు జొన్నలు పంపిణీ చేస్తాం
రాయలసీమ జిల్లాల్లో రేషన్‌ పంపిణీలో బియ్యంతో పాటు- రాగులు, జొన్నలు అందిస్తున్నామని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే సీజన్‌ లో 50 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు – చెప్పారు. ధాన్యం రైతులకు 5లేదా6 రోజుల్లో నగదు జమచేస్తామని హామీ ఇచ్చారు. దళారీలకు అస్కారం లేకుండా కొనుగోళ్లు ఉంటాయన్నారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement