Sunday, April 28, 2024

ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలోపేతం చేస్తాం : కొణిదెల నాగబాబు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని, ఎందుకంటే ప్రభుత్వానికి కనీసం చలనం లేదని జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు ఆరోపించారు. మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, శుక్రవారం విశాఖలోని జనసేన ప్రాంతీయ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాము పర్యటించానని, కార్యకర్తలు,నాయకుల చెప్పిన సమస్యలు,సూచనలు,సలహాలను తెలుసుకున్నామన్నారు.ముందస్తు ఎన్నికల జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బూత్‌ కమిటీల నియామకంతో పాటు, పార్టీ నాయకులను పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ మేము సైతం ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేధింపులు, విధ్వంసాలు, అవినీతి,అక్రమాలతో ఆరాచక పాలన సాగుతుందని, ఈ పాలనకు తెరదించేందుకు ప్రతి కార్యకర్త విధిగా పనిచేయాలన్నారు. అమలాపురంలో జరిగిన అల్లర్లకు జనసైన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే జనసైనికులపై తప్పుడు కేసులు బనాయించి, అధికార పార్టీ నాయకులు పైశాచిక ఆనందాన్ని పోందుతున్నారన్నారు.

పొత్తుల విషయంపై అధిష్టానానిదే నిర్ణయం..

ఇక ఏపీలో జనసేన పార్టీ పొత్తుల విషయంలో తాను ఏమీ మాట్లాడలేనని,ఆ వ్యవహారమంతా పార్టీ అధిష్టానం, పవన్‌కళ్యాణ్‌ చూసుకుంటున్నారన్నారు. విశాఖలో ఏన్నో ఏళ్లుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రుషికొండ ప్రాంతాన్ని అధికార పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కి కొండల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. పార్టీ బలోపేతం కోసం పాదయాత్రలు చేసే అవకాశం లేదని, ఆ తరహాలోనే ఏదైనా యాత్ర చేపట్టే అవకాశముందని నాగబాబు అన్నారు.తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీ,ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదని, ,కేవలం పార్టీ పటిష్టతకు ఏమి ఆశించకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. అన్నయ్య చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని,కేవలం సినీ రంగం,వారి సమస్యలకే పరిమితమవుతున్నారన్నారు. మెగా ఫ్యాన్స్‌ ఎవరితో ఉండాలన్నది వారి వ్యక్తిగత విషయమని అయితే వారంతా జనసేన వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకు చెందిన కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని, అధినేత ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నాగబాబు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు బొలిశెట్టి సత్య,టి.శివశంకర్‌, జనసేన డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు,సీనీయర్‌ నాయకులు సంకు వెంకటేశ్వరరావు, మహిళ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement