Wednesday, May 1, 2024

కితాబులో అంతుచిక్కని వింత వ్యాధి.. నాలుగు నెలల్లో ఐదుగురు చిన్నారులు మృతి

కొయ్యూరు, (అల్లూరి) పభన్యూస్‌ : ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన స్థితిగతుల్లో కనీసం మార్పు రావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం,ప్రజాప్రతినిధుల ఆలసత్వం కారణంగా గిరిజనులకు కష్టాలు నిత్యకృత్యమైయ్యాయి. అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలంలో నేటికీ పలు గ్రామాల్లో శుభ్రమైన తాగునీరు, రోడ్డు, విద్యుత్‌ సదుపాయాలు లేని పరిస్థితి ఉంది అంటే అక్కడి సమస్యలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని అతి మూరుమూల ప్రాంతామైన కితాబు గ్రామంలో నాలుగు నెలలుగా అంతుచిక్కని వ్యాధితో ఐదుగురు చిన్నారులు మృతి చెందగా, తాజాగా గురువారం రాత్రి ఆరు నెలల పాప మృతి చెందింది. నిద్రపోతున్న ఆ చిన్నారి రాత్రి 3గంటల సమయంలో వాంతులు చేసి మెలికులు తిరుగుతూ మృతి చెందినట్టు- చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో గ్రామస్థులంతా మా గ్రామానికి ఏం జరిగింది? తాగునీరు కలుషితమవ్వడమే కారణామా? లేక మరి ఏదైనా సమస్య ఉందా అర్థం కాకపోవడంతో ఆయా గ్రామస్థులంతా సతమతమవుతున్నారు. ఇదే కితాబులో గత నాలుగు నెలలుగా ఐదుగురు నెల నుండి ఐదు నెలల చిన్నారులు ఇవే లక్షణాలతో మృత్యువాత పడినట్టు గ్రామ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలియజేసారు.

కానరాని వైద్య సిబ్బంది..

నాలుగు నెలలుగా ఇదే గ్రామంలో చిన్నారులు మృతి చెందుతున్నప్పటికీ నేటికి ఆయా గ్రామాన్ని ఒక్కసారి కూడా వైద్య సిబ్బంది సందర్శించలేదంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. కనీసం నెలకు ఓ సారి కూడా ఆరోగ్యసిబ్బందిని కితాబు గ్రామాన్ని సందర్శించినా అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుస్తాయని వారంతా అంటున్నారు, కితాబు గ్రామం పై దశబ్బాకాలంగా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పూర్తి నిర్లక్ష్యంగానే చూస్తున్నారని ఆ పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం. వెంకటేశ్వర్లు అంటున్నారు. ఓట్లు కోసం ఉన్న శ్రద్ధ నాయకులు తమ లాంటి గ్రామాల కనీస అవసరాలలైన తాగునీరు, రోడ్డు, వంటివి కల్పించికనే తమకు ఈ కష్టాలు, చిన్నారులు, పెద్దల మృత్యువు పాలవటం నిత్య కృత్యం అవుతున్నట్టు వారు వాపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement