Monday, April 29, 2024

కాణిపాకంలో ప్రమాణం చేద్దాం రాః వైసీపీ ఎమ్మెల్యేకి విష్ణు సవాల్

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిమధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తీవ్రస్థాయికి చేరింది. విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద దొంగ అని, పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశాడని ఆయన ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ విసిరారు. ‘’ఈ నెల 10న కాణిపాకం వినాయక ఆలయంలో ప్రమాణం చేద్దాం రా…’’  అని సవాల్ విసిరారు. సచ్ఛీలతపై ఎమ్మెల్యే శివప్రసారెడ్డి బహిరంగ ఆహ్వానం పంపారు. తన సచ్చీలతను నిరూపింపచుకునేందుకు కాణిపాకం వినాయకుని ఎదుట ఈ నెల 10న ప్రమాణం చేస్తానని ప్రకటించారు. హిందూ ద్రోహి టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేత విష్ణు ఆరోపించారు. శివప్రసాద్ రెడ్డి సరైన వివరణలు ఇవ్వలేకపోగా, తనపై  వ్యక్తిగత విమర్శులతోపాటు తప్పుడు అవినీతి ఆరోపణలను చేశారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను అసత్యాలని పేర్కొంటూ కాణిపాకంలోని దేవుని సన్నిధిలో పది రోజుల్లో ప్రమాణం చేస్తానని చెప్పారు. కానీ రాచమల్లు డొంకతిరుగుడు సమాధానాలతో తప్పించుకుంటున్నారని విష్ణు విమర్శించారు. అందుకే తానే తేదీని ప్రకటిస్తున్నానని, ఆగస్టు 10వ తేదీ ఉదయం 11 గంటలకు కాణిపాకంలో స్వామివారి సన్నిధికి తాను వస్తానని, శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చి ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆ రోజున రాకపోతే శివప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును సమాజమే నిర్ణయిస్తుందని తెలిపారు. శివప్రసాద్ రెడ్డి వచ్చినా, రాకపోయినా తాను మాత్రం కాణిపాకం వచ్చి దేవుడి ముందు తన నిజాయతీ నిరూపించుకుంటానని విష్ణు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement