Thursday, May 9, 2024

ఈనెల 5,6 తేదీల్లో తిరుమలలో తుంబురతీర్ధ ముక్కోటి

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీ తుంబురతీర్ధ ముక్కోటి ఉత్సవం ఈనెల 5,6 తేదీల్లో ఘనంగా జరగనుంది. తీర్ధానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురతీర్ధానికి 5 వ తేది ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6 వ తేది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్‌ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. ప్రథమి చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.

ఈ తీర్ధానికి ఎక్కువదూరం నడవాల్సి వస్తుంది కావున గుండె, శ్వాసకోస సమస్యలు, స్థూలకాయం ఉన్న వారికి అనుమతిలేదు. అలాగే భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పోలీసుశాఖ, అటవిశాఖ, టీటీడీ విజిలెన్స్‌ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురతీర్ధం వరకు అక్కడక్కడా భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.

ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురతీర్ధ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్ధస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురతీర్ధ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement