Wednesday, May 1, 2024

విశాఖ స్టీల్ ఫ్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ – కెసిఆర్ సంచ‌ల‌న నిర్ణయం..

హైద‌రాబాద్ – విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుప‌రం కాకుండా అడ్డుకునేందుకు కెసిఆర్ స‌ర్కార్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.. ఇందుకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు కెసిఆర్.. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోసం వెంటనే విశాఖ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లోనే వైజాగ్ వెళ్లనున్న బృందం యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.


ఇది ఇలాఉంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల బహిరంగంగానే విమర్శించారు. బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న అవసరమైన పరిష్కార మార్గాలను వారు సూచించారు. వాటిని ఆయన కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ నిన్న ఈ విషయమై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లు కనుక తెలంగాణ ప్రభుత్వ సొంతమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటచ్చొన్నది కేసీఆర్ అభిప్రాయం. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. స్టీల్ ప్లాంట్ నుంచి కొనుగోలు చేసే ఉక్కు వ‌ల్ల ప్ర‌భుత్వానికి గ‌ణ‌నీయంగా ఆదాయం మిగులుతుంద‌ని భావిస్తున్నారు..

15తో ముగియనున్న గడువు
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తేదీలోగానే తెలంగాణ ప్ర‌భుత్వం బిడ్ వేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement