Sunday, April 28, 2024

TDP and Jana Sena – తొలిసారి జ‌న‌సేన కండువాతో చంద్ర‌బాబు నాయుడు..

ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో పార్టీలతో పొత్తులు, సంకీర్ణ రాజకీయం చేసిన చంద్రబాబు దాదాపుగా తొలి సారి మరో పార్టీ కండువాను ధరించారు.

కుప్పంలో చంద్రబాబు :
చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. పవన్ తో కలిసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉమ్మడి సభలు నిర్వహించాలని ప్లాన్ చేసారు. రెండు పార్టీల నుంచి ఉమ్మడి మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు టీడీపీ అధ్యక్ష హోదాలో జాతీయ స్థాయిలో పలు కూటమిలకు కన్వీనర్ గా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలోనూ టీడీపీ అధినేతగా పలు పార్టీలతో పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్ర విభజన తరువాత పొత్తులు ఏర్పడ్డాయి. కానీ, ఏనాడు చంద్రబాబు మరో పార్టీ కండువా ధరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు మెడలో జనసేన కండువా :
పార్టీ శ్రేణులు మిత్రపక్షాల కండువాలు, జెండాలతో కలిసి ప్రదర్శన, ..సభలో పాల్గొనటం సహజం. 2014 లో టీడీపీ, జనసేన పొత్తు సమయంలోనూ ఏనాడు చంద్రబాబు జనసేన కండువా, పవన్ కల్యాణ్ టీడీపీ కండువా కప్పుకోలేదు. ఇద్దరు పార్టీ అధినేతలుగా ఉంటూ తమ కేడర్ కు దిశా నిర్దేశం చేసారు. ఇప్పుడు తిరిగి ఈ రెండు పార్టీలు పొత్తుతో వెళ్తున్న వేళ కుప్పంలో ఆసక్తి కర పరిణామం జరిగింది. జనసేనకు చెందిన స్థానిక నేతలు తమ పార్టీ కండువా చంద్రబాబు మెడలో అలంకరించారు. దీంతో, ఒక్కసారిగా చంద్రబాబు షాక్ అయ్యారు. కానీ, అక్కడ వెంటనే ఆ కండువాను తీసే ప్రయత్నం చేయలేదు. తీయటం ద్వారా రాజకీయంగా కొత్త వివాదం ఏర్పడుతుందని భావించినట్లు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో చర్చ :

చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసిన నేతలు తమ పార్టీతో పాటుగా పవన్ కల్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేసారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అదే వేదిక పైన ఉన్నారు. అయితే, ఒక పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబుకు జనసేన శ్రేణులు తమ కండువా వేయటం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా .ఏకంగా టీడీపీ అధ్యక్షుడికే జనసేన కండువా వేయటం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జనసేనలో చేరిన చంద్రబాబు అంటూ వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement