Wednesday, May 1, 2024

15-18లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం

శ్రీకాకుళం : జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పలు కేంద్రాలు, పాఠశాలల్లో తనిఖీ చేశారు. అనంత‌రం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 1.34 లక్షలు ఉన్నారన్నారు. వీరందరికీ వాక్సినేషన్ పూర్తి చేయుటకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో 929 గ్రామ, వార్డు సచివాలయాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని, తద్వారా కరోనా నుండి రక్షణ లభిస్తుందన్నారు. జిల్లాలో మొదటి డోసు వాక్సినేషన్ ఇప్పటికే శత శాతం పూర్తి చేశామన్నారు.

రెండవ డోసు 70 శాతం పూర్తి అయ్యిందని, అందరూ రెండవ డోసు వేసుకొని కరోనా నుండి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. 15 -18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ వ్యాక్సినేష‌న్ వేసుకోవాలని, కుటుంబంలో ఇంకా వ్యాక్సినేషన్ వేసుకోవలసిన వారుంటే వెంటనే తీసుకునే విదంగా చైతన్య పరచాలన్నారు. పిల్లలకు కోవ్యాక్సిన్ టీకా ఇవ్వడం జరుగుతోందని, వ్యాక్సిన్ సురక్షితమైనదని ఆయన చెప్పారు. విద్యార్థులతో వ్యాక్సినేషన్ పై ముఖాముఖి మాట్లాడారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాక్సినేషన్ పొందాలని సూచించారు. చుట్టు ప్రక్కల ఉన్నవారికి తెలియజేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు మాట్లాడుతూ… కోవ్యాక్సిన్ సురక్షితమైనదని పేర్కొన్నారు. శరీర తత్వం అనుసరించి ఒకటి, రెండు శాతం మందికి కొద్దిపాటి జ్వరం, ఒంటి నొప్పులు రావచ్చని, దానికి ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి ఇమ్యునైజేషన్ అధికారి కొయ్యాన అప్పారావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement