Thursday, May 16, 2024

ష‌ర్మిల మా ఆత్మీయ సోద‌రి… అందుకే పార్టీ పెట్ట‌వ‌ద్దన్నాం – స‌జ్జ‌ల‌…

అమ‌రావ‌తి – ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సోద‌రి షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని, అందుకే తెలంగాణాలో పార్టీ పెట్ట‌వ‌ద్ద‌ని సూచించామ‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లో ష‌ర్మిల త‌న అభిమానుల‌తో ఆత్మీయ స‌మావేశం ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప‌రస్పర సహకారం ఉండాలని జగన్ భావించారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటుందనే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నామని ఆయన వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో ఏ ప్రయత్నం చేసినా ఏపీలో గ్యాప్ ఏర్పడే అవకాశం వస్తుందని జగన్ భావించారని సజ్జల వెల్ల‌డించారు. పార్టీ విస్తరణ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని జగన్ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా వద్దని నచ్చజెప్పేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన తెలిపారు. పార్టీ ఏర్పాటు వల్ల కలిగే కష్ట, నష్టాలు, రాజకీయంగా ఉన్న పరిమితులు ఇవన్నీ షర్మిలకు జగన్ వివరించారన్నారు. కానీ, షర్మిల తన స్వీయ అనుభవంతో పార్టీ ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్న ఆయన.. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రతి అంశానికి షర్మిలనే బాధ్యురాలు అవుతారని సజ్జల స్పష్టం చేశారు. అయితే జగన్, షర్మిల వ్యక్తిగత సంబంధాలకు, పార్టీలకు సంబంధం ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement