Friday, April 26, 2024

ఏపీలో పరిశ్రమలకు ఊరట.. ఆంక్షలు ఎత్తివేసిన ప్రభుత్వం

ఏపీలో పరిశ్రమలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమలకు విద్యుత్‌ ఆంక్షల నుంచి భారీ ఊరట లభించింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ వినియోగం 235 మిలియన్‌ యూనిట్ల నుండి 161 మిలియన్‌ యూనిట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

కాగా, దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల అభ్యర్థన మేరకు పరిశ్రమలపై ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఏపీఈఆర్‌సీ ఆంక్షలు విధించింది. తొలుత వారంలో ఒక రోజు పవర్‌ హాలిడేతో పాటు, విద్యుత్‌ వినియోగంలో 50 శాతానికే అనుమతించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆంక్షలను సడలించింది. తాజా ఆదేశాల ప్రకారం.. నిరంతరం విద్యుత్‌ వినియోగించే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ డిమాండ్‌లో 70 శాతం వినియోగించుకోవచ్చు. మిగతా సమయంలో 60 శాతం వాడుకోవాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement