Monday, April 29, 2024

Tirupati: రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం.. 9మంది స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి సిటీ, జూన్ 24 (ప్రభ న్యూస్) : రెండు కోట్ల రూపాయల విలువ గల ఎర్రచందనం అక్రమ రవాణా చేసి తీసుకొని వెళుతుండగా ఎల్లమంద ఉస్తికాయల పెంట రోడ్ లో గల ఎల్లమంద క్రాస్ వద్ద వాహనాలను సీజ్ చేసి, వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లను వెంటాడి ఎల్లమంద క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగిందని వివరించారు. చాకచక్యంగా ఆ వ్యక్తులపై దాడి చేసి తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు మూడు ఇన్నోవా కార్లు, ఒక హోండా కారు, ఒక బొలెరో పికఅఫ్ వాహనం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.

అలాగే వీటితోపాటు 33 ఎర్రచందనం దుoగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. వీరిపై పీడీయాక్ట్ కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సరిహద్దు చెక్ పోస్టుల యందు ఇదివరకే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వాహనాలు తనిఖీ కార్యక్రమం చేస్తూ కట్టడి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సంపద అరుదైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అక్రమ రవాణా చేసినా, సహకరించినా శిక్షకు అర్హులే అని వివరించారు. పట్టుబడిన వారు సరుకును శేషాచల అటవీ ప్రాంతం నుండి వేలూరుకు పంపిస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాగే వీరు రెండు వేరువేరు ముఠాలకు చెందినవారు ఈ తరలింపు కోసం కలిసి పనిచేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు, చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్, భాకరాపేట సీఐ తులసి రామ్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రకాష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement